భారీగా పీజీ సీట్ల పెంపు 

Increasing PG seats in government medical college - Sakshi

ఒక్క నెల్లూరు వైద్య కళాశాలలోనే 120 సీట్లకు దరఖాస్తు 

విజయవాడ ‘సిద్ధార్థ’లో భారీగా పెరగనున్న పీజీ గైనకాలజీ సీట్లు

గుంటూరులో రెండు పీజీ రేడియాలజీ సీట్లు పెంచేందుకు ఏర్పాట్లు 

ఈ మూడు కాలేజీల్లో మొత్తం 158 సీట్ల పెంపునకు కసరత్తు 

అఫిలియేషన్‌కు ఎన్టీఆర్‌ వర్శిటీకి దరఖాస్తు చేసిన వైద్య విద్యాశాఖ

సీట్లు పెరగడంవల్ల స్పెషాలిటీ సేవలూ అందుబాటులోకి

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంటరీ నియోజకవర్గానికొకటి చొప్పున ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని ఏర్పాటుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు పీజీ వైద్య సీట్లను పెంచేందుకు నడుం బిగించింది. ప్రస్తుతం ప్రభుత్వ పరిధిలో 11 వైద్య కళాశాలలు ఉన్నాయి. ఇందులో 980 వరకూ పీజీ వైద్య సీట్లున్నాయి. మరిన్ని సీట్లు పెరగాలంటూ యూనిట్లు పెంచడం, మౌలిక వసతులు కల్పించడం, పడకల స్థాయి పెంచడం వంటివి చేయాలి. ఇవన్నీ చేసేందుకు సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఈ ఏడాది నెల్లూరు, గుంటూరు, విజయవాడ వైద్య కళాశాలల్లో భారీగా సీట్లు పెంచేందుకు ఇప్పటికే వైద్య విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. పెంచనున్న సీట్లకు అఫిలియేషన్‌ కోసం ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీకి  దరఖాస్తు చేసింది. యూనివర్శిటీ అనుమతించిన అనంతరం భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)కి దరఖాస్తు చేస్తారు. జూన్‌ 30లోగా ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని వైద్యవిద్యా శాఖాధికారులు తెలిపారు. 

ఆ మూడు కాలేజీల్లో సీట్ల పెంపు 
► నెల్లూరు, గుంటూరు, విజయవాడలోని మెడికల్‌ కాలేజీల్లో పీజీ సీట్లు పెంచేందుకు ఏర్పాట్లుచేశారు. 
► కొత్తగా నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 104 క్లినికల్‌ పీజీ వైద్య సీట్లు, మరో 16 నాన్‌ క్లినికల్‌ పీజీ వైద్య సీట్లు పెంచనున్నారు. 
► గుంటూరు వైద్య కళాశాలలో రెండు ఎండీ రేడియో డయాగ్నసిస్‌ సీట్లు ఉండగా మరో 4 అదనంగా ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. 
► విజయవాడలో ప్రసవాలు ఎక్కువగా జరుగుతుండటంతో 19 గైనకాలజీ సీట్లు పెంచేందుకు కృషి చేస్తున్నారు. 
► ఈ మూడు వైద్య కళాశాలల్లో 158 పీజీ వైద్య సీట్లు కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 
► ఈ ఏడాది గుంటూరులో కొత్త విభాగాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. 
► అదనంగా సీట్లు పెరగడంవల్ల యూనిట్లు పెరగడంతోపాటు స్పెషాలిటీ సేవలు పేద రోగులకు అందుబాటులోకి వస్తాయి. 

మిగతా కాలేజీల్లోనూ ఏర్పాటుకు సన్నాహాలు 
ప్రస్తుతం ఈ మూడు కాలేజీల్లో సీట్లకు దరఖాస్తు చేస్తున్నాం. ఈ సీట్లకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది నుంచి ఇవి అందు బాటులోకి వస్తాయి. ఇవికాకుండా ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆదేశాల మేరకు మిగతా కాలేజీల్లోనూ ఎక్కడ అవకాశముంటే అక్కడ పీజీ వైద్య సీట్ల పెంపునకు కృషిచేస్తున్నాం. 
– డా. కె.వెంకటేష్, వైద్యవిద్యా సంచాలకులు  

‘పీజీ’ చేసిన వారే బోధనకు అర్హులు
రాష్ట్రంలో పలు ప్రైవేటు వైద్య కళాశాలల్లో నాన్‌ మెడికల్‌ పీజీ వారితో బోధన చేయిస్తున్నారని, ఇది భారతీయ వైద్య మండలి నిబంధనలకు విరుద్ధమని ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రీ క్లినికల్, పారా క్లినికల్‌ సబ్జెక్టుల్లో ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ చేసిన వారితోనే బోధన చేయించాలని, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా వీళ్లు మాత్రమే అర్హులని ఎంసీఐ స్పష్టంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీన్ని తోసిరాజని ప్రయివేటు వైద్య కళాశాలలు ఎంఎస్‌సీ బయో కెమిస్ట్రీ, ఎంఎస్‌సీ అనాటమీ, ఎంఎస్‌సీ ఫిజియాలజీ, ఎంఎస్‌సీ ఫార్మకాలజీ చదివిన వారితో పాఠాలు చెప్పేందుకు అనుమతిస్తున్నారు.
► ఎంఎస్‌సీ చదివిన వారైతే తక్కువ వేతనానికి వస్తారని, మెడికల్‌ పీజీ చదివిన వారికి ఎక్కువ వేతనం ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేస్తున్నట్టు ఫిర్యాదులొస్తున్నాయి. 
► ఒకవేళ ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ అభ్యర్థులు లేకుంటే ఎంఎస్‌సీ చదివిన వారిని కేవలం ట్యూటర్లుగా మాత్రమే నియమించుకోవాలని ఎంసీఐ స్పష్టం చేసింది. 
► నాన్‌ మెడికల్‌ పీజీ చేసిన వారు పాఠాలు సరిగా చెప్పలేకపోతున్నారని ప్రైవేటు వైద్యకళాశాలల్లో చదువుతున్న ఎంబీబీఎస్‌ వైద్య విద్యార్థులు వాపోతున్నారు. 
► త్వరలోనే దీనిపై ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి, రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు కొంతమంది వైద్యవిద్యార్థులు పేర్కొన్నారు. 
► 2018లో అప్పటి ప్రభుత్వం సైతం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఎంఎస్‌సీ, పీహెచ్‌డీ చేసిన వారూ అర్హులని నోటిఫికేషన్‌ ఇవ్వడం ఎంసీఐ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. 

ముగిసిన తొలి విడత పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ 
జీవో 57తో 187 మంది ఎంఆర్‌సీలకు మేలు 
2020–21 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్, ఎండీఎస్‌ కోర్సుల్లో అడ్మిషన్లకు డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ రెండు రోజులుగా నిర్వహించిన తొలి విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ ఆదివారంతో ముగిసింది. పీజీ మెడికల్‌లో 1,134 సీట్లకు 1,091, ఎండీఎస్‌లో 235 సీట్లకు 219 సీట్లు భర్తీ అయ్యాయని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.శంకర్‌ తెలిపారు. 2013లో ఇచ్చిన జీవో 43 ప్రకారం మెరిటోరియస్‌ రిజర్వుడు క్యాండిడేట్స్‌ (ఎంఆర్‌సీ) విద్యార్థులకు అన్యాయం జరుగుతోందనే విషయమై పలు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసి కొన్ని సవరణలు చేస్తూ పీజీ మెడికల్‌కు జీవో నం.57, పీజీ డెంటల్‌ (ఎండీఎస్‌)కు జీవో నెం.58 జారీ చేసిన విషయం విదితమే. దీంతో ఈ జీవోలతో తొలి విడత కౌన్సెలింగ్‌లోనే పీజీ మెడికల్‌లో 187 మంది, ఎండీఎస్‌లో 30 మంది ఎంఆర్‌సీ అభ్యర్థులకు మేలు జరిగినట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ తెలిపారు. అయితే 57, 58 జీవోలపై కొంత మంది ఆదివారం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేసినట్లు యూనివర్సిటీ వర్గాల సమాచారం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top