తెల్లారిన బతుకులు | IN road accident four people died | Sakshi
Sakshi News home page

తెల్లారిన బతుకులు

May 1 2014 1:47 AM | Updated on Aug 30 2018 3:58 PM

బతుకుబాటలో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారక మునుపే ఆ జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ట్రాక్టర్‌ను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే విగతజీవులు కాగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా కర్నూలు జిల్లా వాసులేనని పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
 మానవపాడు(మహబూబ్‌నగర్), న్యూస్‌లైన్: బతుకుబాటలో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారక మునుపే ఆ జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ట్రాక్టర్‌ను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే విగతజీవులు కాగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా కర్నూలు జిల్లా వాసులేనని పోలీసులు తెలిపారు.
 
 మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బొల్లవరం గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం వేముల స్టేజి సమీపంలోని ప్రైవేట్ వన నర్సరీ వద్దకు పసుపు కొమ్ములను నూర్పిడి చేసేందుకు ట్రాక్టర్‌లో మిషన్ తీసుకుని బయలుదేరారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై మానవపాడు మండలం ఇటిక్యాలపాడు స్టేజీ దాటగానే వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది.
 
 ఘటనలో ట్రాక్టర్‌లోని మల్లయ్య(27), అశోక్(22), సాంబశివుడు(46), వెంకట్రాముడు(48) అక్కడికక్కడే మృతి చెందారు. షేక్షావలి పరిస్థితి విషమంగా ఉండటంతో హైవే అంబులెన్స్, పెట్రోలింగ్ సిబ్బంది కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. ప్రమాదంలో జాతీయ రహదారిపై అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఘటన జరిగిన రెండు గంటల తర్వాత పోలీసులు ప్రమాదస్థలికి చేరుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అలంపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement