ఏపీఎస్ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సి.చంద్రయ్య డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సి.చంద్రయ్య డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్ కూడలి వద్ద గల రెవెన్యూ అతిథి గృహంలో గురువారం ఎన్ఎంయూ నెక్ రీజియన్ అధ్యక్షుడు బీఎస్ రాములు అధ్యక్షతన రీజనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 1 నుంచి ఎంప్లాయీస్ యూనియన్ గడువు ముగిసిందని, ఇంతవరకూ ఎన్నికలు నిర్వహించకపోవడం శోఛనీయమన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఏప్రిల్ 1, 2013 నుంచి రావాల్సిన జీతభత్యాలు తక్షణమే పరిష్కరించాలన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి.వి.రమణారెడ్డి మాట్లాడుతూ యాజమాన్యం ఏకపక్షంగా ఎంప్లాయీస్ యూనియన్కు వత్తాసు పలుకుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవ సభ్యులపై వేధింపులకు గురిచేస్తోందని పేర్కొన్నారు.
కోపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఎన్ఎంయూ కాలంలో లాభాలతో నడిపించి కార్మికులకు త్వరితగతిన లోన్స్ వచ్చేలా కృషి చేశామన్నారు. అయితే ఈయూ గుర్తింపు సంఘంగా వచ్చిన తరువాత సొసైటీని నష్టాలలో నడిపిస్తూ కార్మికులకు లోన్లు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పీవీవీ మోహన్ మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యం ఎన్ఎంయూ కార్మికులపై జరుగుపుతున్న దమనకాండను ఖండిస్తున్నామన్నారు. ఎన్ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పులు, ఆస్తులను ఆంధ్రా, తెలంగాణాలకు 58:42 నిష్పత్తిలో పంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎన్ఎంయూ నాయకులు ఎస్.సిమ్మయ్య, ఎంవీఆర్ మూర్తి, జోనల్ చైర్మన్ వి.ప్రదీప్కుమార్, కేవీఆర్ నర్సింగరావు, శ్రీకాకుళం, విజయనగరం కార్మికులు పాల్గొన్నారు.