సర్వే పనులు చకచకా | Hyderabad-srisailam national highway expansion survey fast | Sakshi
Sakshi News home page

సర్వే పనులు చకచకా

Aug 22 2013 1:24 AM | Updated on Mar 28 2018 10:56 AM

హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణకు సర్వే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.

కందుకూరు, న్యూస్‌లైన్: హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణకు సర్వే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆర్‌అండ్ బీ పరిధిలో ఉన్న ఈ రహదారి ప్రస్తుతం నేషనల్ హైవే (నంబర్ 765)గా మారింది. దీంతో రహదారిని విస్తరించాలని ప్రతిపాదించిన నేషనల్ హైవే అథారిటీ అధికారులు సర్వేను ముమ్మరం చేశారు.
 
 10మీటర్ల వెడల్పుతో...
 మహబూబ్‌నగర్ జిల్లా డిండి వైపు నుంచి 20 రోజుల క్రితం ప్రారంభమైన సర్వే పనులు ప్రస్తుతం కందుకూరు మండల పరిధిలో కొనసాగుతున్నాయి. కాగా జాతీయ రహదారి విస్తరణకు నేషనల్ హైవే అథారిటీ నుంచి రూ.175 కోట్లు నిధులు మంజూరైనట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం రహదారి వైపు జిల్లాలో 23వ కిలోమీటర్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా డిండి వరకు 85కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించనున్నారు. ఇప్పటివరకు కొన్నిప్రాంతాల్లో 7మీటర్లు, మరికొన్ని ప్రాంతాల్లో 5.5 మీటర్లుగా ఉన్న రహదారిని నేషనల్ హైవే ప్రమాణాలకు అనుగుణంగా 10 మీటర్ల వెడల్పుతో బీటీగా మార్చనున్నారు. వర్షాకాలంలో శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు డిండి రిజర్వాయర్ వద్ద ఇబ్బందులు ఎదుర్కొనేవారు. నీరు బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తూ రాకపోకలకు అంతరాయం కలిగేది. రహదారి విస్తరణలో భాగంగా ఆ వంతెనను హైలెవెల్ బ్రిడ్జిగా మార్చడానికి రూ.9 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
 
 ఆరు నెలల్లో విస్తరణ పనులు ప్రారంభం
 85 కిలోమీటర్ల జాతీయ రహదారిని 10 మీటర్ల వెడల్పుతో విస్తరించటానికి ప్రస్తుతం సర్వే పనులు కొనసాగుతున్నాయి. ఆరు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి విస్తరణ పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం.
 - నారాయణ, ఏఈఈ, నేషనల్ హైవే అథారిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement