వంద రోజులు దొంగ డాబులు | hundred days ruling of chandrababu naidu | Sakshi
Sakshi News home page

వంద రోజులు దొంగ డాబులు

Sep 17 2014 2:43 AM | Updated on Aug 8 2018 5:33 PM

డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తామన్న మోసపూరిత హామీపై ఆయా సంఘాలు సంఘటితమవుతున్నాయి.

డ్వాక్రా సంఘటితమవుతోంది
 డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తామన్న మోసపూరిత హామీపై ఆయా సంఘాలు సంఘటితమవుతున్నాయి.  లక్ష రూపాయలకే పరిమితం చేయడం ... అదీ ఆచరణలోకి తేకపోవడమేమిటంటూ నిలదీస్తున్నాయి. చేనేతన్నలకూ పచ్చ నామాలే పెట్టారు.

 ఒంగోలుకు మొండి చేయి
 ఎన్నికల వరకే పార్టీలు తరువాత అభివృద్ధే ధ్యేయంగా పని చేసేవాడే నిజమైన నేత. మరి చంద్రబాబు వైఖరి ఎలా ఉందంటే ఓట్లు వేయని వారిపై కక్ష సాధించడమే కాదు ... ఆ జిల్లాపై కూడా కన్నెర్ర చేస్తున్నారు. ఇటీవల జిల్లాకు చెందిన ఓ పార్టీ ప్రతినిధులు కలిసి జిల్లా అభివృద్ధిపై వినతిపత్రం ఇస్తే ‘మీ జిల్లా ప్రజలు మా పార్టీకి ఓటెయ్యలేదు ... అభివృద్ధి ఎందుకు చెయ్యాలంటూ’ ఎదురు తిరగడంతో బాబుగారి విజన్ వెర్రితనం ఏడిసినట్టుందని వెనుతిరిగారు.

 అధికారంలోకి రాగానే హత్యా రాజకీయాలు
 అధికారంలోకి రాగానే అది చేస్తాను, ఇది చేస్తానంటూ ఓట్లు దండుకున్న బాబు అవన్నీ గాలికి వదిలేసి జిల్లాలో హత్యా రాజకీయాలకు తెరదీశారు. మహరాజా అంటే మరి రెండు కొరడా దెబ్బలు కొట్టమన్నట్టుగా అసెంబ్లీలోనే వైఎస్సార్ సీపీ పక్ష నేత జగన్మోహన రెడ్డి ప్రశ్నిస్తే మా తాతలు మూతులు వాసన చూడండంటూ పాత చరిత్ర చెబుతూ పక్కతోవ పట్టించే ప్రయత్నం చేశారు.

 రుణమాఫీ
 తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండన్నట్టుగా రుణమాఫీ వ్యవహారం తయారైంది.  ఓ వైపు రుణమాఫీ చేసేసినట్టు టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తూ, అనుచరులతో ప్రకటినలిప్పిస్తూ ... మిఠాయిలు తింటూ, తినిపించుకుంటూ, సన్మానాలు, సత్కారాలు చేయించుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న జిల్లా రైతులు మాత్రం జుత్తు పీక్కుంటున్నారు.  ‘పచ్చ’ రాతలు చూసి మరింత పిచ్చెక్కిపోతున్నారు.

 ప్రాజెక్టులకు భరోసా ఏదీ
 జలయజ్ఞం ప్రాజెక్టులకు భరోసా లేకుండా పోయింది.  వెలిగొండ  ప్రాజెక్ట్ట్‌ను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిధులు కేవలం రూ.5 కోట్లు కేటాయించి ఈ ఏడాదిలో పూర్తి చేస్తానని చంద్రబాబు ప్రకటించి జిల్లా ప్రజల చెవిలో పువ్వు పెట్టారు.  

 టీడీపీ ప్రతినిధులూ మీరెక్కడ
  జిల్లా టీడీపీ ప్రతినిధులూ మీ చిరునామా ఎక్కడంటూ జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  ఒంగోలు గిత్తకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న చిరునామానే చెరిపేస్తారా అని కన్నెర్ర చేస్తున్నారు. ఈ జిల్లాకు కనీసం వెటర్నరీ యూనివర్శిటీని కూడా తెప్పించుకోలేని చేతగాని మీకు పదవులెందుకంటూ పిడికిలి బిగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement