ఎన్నాళ్లిలా? | How many years like this..? | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లిలా?

Jul 17 2014 2:21 AM | Updated on Sep 5 2018 2:07 PM

ఎన్నాళ్లిలా? - Sakshi

ఎన్నాళ్లిలా?

కర్ణుడి చావుకు వేయి కారణాలన్న చందంగా జిల్లా రైతుల పరిస్థితి తయారైంది. అసలే అంతంత మాత్రం వర్షపాతం.. నాలుగు చినుకులు పడితే చాలు..

సాక్షి ప్రతినిధి, అనంతపురం :  కర్ణుడి చావుకు వేయి కారణాలన్న చందంగా జిల్లా రైతుల పరిస్థితి తయారైంది. అసలే అంతంత మాత్రం వర్షపాతం.. నాలుగు చినుకులు పడితే చాలు.. చాలీ చాలని పదునులోనే వేరుశనగ గింజలు విత్తుతారు. అదృష్టం బాగుండి మళ్లీ వానలు కురిస్తే పది మూటల కాయలవుతాయి. లేకపోతే పశువులకు బండెడు మేత మిగులుతుంది. ఇంత అనిశ్చిత పరిస్థితుల్లో కాడి భుజానేసుకుని సేద్యం చేస్తున్న జిల్లా రైతన్నలకు గోరుచుట్టుపై రోకటి పోటులా మరో అదనపు సమస్య అడవి జంతువుల రూపంలో ఎదురవుతోంది.

జిల్లాలో అడవులు అంతరించి పోతుండటం, కొండ కోనల్లో నీటి వనరులు తగ్గిపోవడం లాంటి కారణాలతో అడవి జంతువులు పంట పొలాలపై పడుతున్నాయి. ధర్మవరం, శింగనమల, ఉరవకొండ తదితర నియోజకవర్గాల్లో వాటి బెడద కారణంగా వేలాది ఎకరాలను బీడు పెట్టారు. దీన్నిబట్టే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బోర్ల కింద అంతో ఇంతో నీటి వసతి ఉన్న రైతులు పొలాన్ని బీడు పెట్టలేక పైర్లు సాగుచేస్తూ... అడవి జంతువుల బారి నుంచి ఆ పైర్లను రక్షించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు.
 
 పాణాపాయమని తెలిసినా... పొలం చుట్టూ ‘విద్యుత్ కంచె’ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై జిల్లాలో ప్రతియేటా పదుల సంఖ్యలో రైతులు చనిపోతున్నారు. ఇంత జరుగుతున్నా అటు అటవీ శాఖ అధికారులు కానీ, ఇటు వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు కానీ ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు.
 
 పెపైచ్చు తమ శాఖకు సంబంధం లేదంటూ ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నారు. అడవుల్లో వాటికి తాగడానికి నీరు కరువై పొలాల్లోకి వస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో పైరు కాపాడుకునేందుకు ‘కరెంటు కంచె’ వేస్తే విద్యుత్ అధికారులు.. రైతులపై కేసులు పెడుతున్నారు. ఆ కంచె తగిలి జింకలు తదితర జంతువులు చనిపోతే అటవీ శాఖ అధికారులు ఏకంగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారు. అదే రైతు పంట నష్టపోతే మాత్రం పట్టించుకునే నాథులే కరువయ్యారు.
 
 సోలార్ కంచెతో సమస్య పరిష్కారం
 అడవి జంతువుల బారి నుంచి పంటలను రక్షించుకునేందుకు ‘సోలార్ కంచె’ ఏర్పాటు మాత్రమే సురక్షితమైన పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ 50 శాతం సబ్సిడీతో సోలార్ కంచె ఇస్తోంది. అయితే.. ఈ పథకానికి నామమాత్రపు కేటాయింపులు ఉన్నా యి. 2014-15 సంవత్సరానికి ఈ పథకం కింద 30 యూనిట్లకు గాను రూ.15 లక్షలు మాత్రమే కేటాయించారు. ఇవి ఏ మూలకూ సరిపోవు. జిల్లాలో డ్రిప్ సౌకర్యం కల్పిస్తున్న విధంగానే రైతులందరికీ సబ్సిడీపై సోలార్ కంచె ఏర్పాటు చేయాలని, సబ్సిడీ కూడా డ్రిప్‌నకు ఇస్తున్నట్లుగానే 90 శాతం వర్తింపజేయాలని రైతులు కోరుతున్నారు.
 
 అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వల్లే
 అడవి జంతువుల బారి నుంచి పంటలను కాపాడుకునే ప్రయత్నంలో రైతులు చనిపోతున్నారు. ముఖ్యంగా జింకలు, అడవి పందుల వల్ల ఎక్కువగా పంటలు నష్టపోతున్నారు. ఈ సమస్య పరిష్కారంలో అటవీ శాఖ అధికారులు, పాలకులు నిర్లక్ష్య వైఖరి విడనాడాలి.
 ఈ సమస్య పరిష్కారం కోసం మూడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నాం. అయినా స్పందించడం లేదు. జిల్లాలో నెలకొన్న  ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 90 శాతం సబ్సిడీతో రైతులందరికీ సోలార్ కంచె అందజేసేందుకు జిల్లా మంత్రులు చొరవ తీసుకోవాలి.
 - సూర్యనారాయణరెడ్డి, యల్లనూరు మండల రైతు సంఘం
 గౌరవాధ్యక్షుడు
 
 ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం ధర్మపురి, చాబాల, చిన్నహోతూరు,తట్రకల్లు, గంజికుంట, రాగులపాడు తదితర గ్రామాల్లో ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న వేరుశనగ పంటను జింకలు నాశనం చేస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే వజ్రకరూరు, ఛాయాపురం, గంజికుంట గ్రామాల్లో దాదాపు 13వేల ఎకరాలను జింకల బెడద కారణంగా బీడు పెట్టేశారు.
 
 శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. జింకల ధాటికి పండ్లతోటలు కూడా నాశనమవుతున్నాయి. యల్లనూరు, పాతపల్లి, జంగంపల్లి, వెన్నపూసపల్లి, గడ్డంవారిపల్లి, మల్లేపల్లి, 85 నిట్టూరు, తిరుమలాపురం, కల్లూరు, మాలగుండ్ల గ్రామాల్లో దాదాపు మూడు వేల ఎకరాలు బీడుగా వదిలేశారు. గత ఏడాది ఈ ప్రాంతంలో వేల ఎకరాల్లో పంటలు నష్టపోయారు.
 
 తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలం పుప్పాల, పుప్పాలతండా, వెంగన్నపల్లి పరిసరాల్లో పత్తి, వేరుశనగ పంటలను అడవి పందులు నాశనం చేస్తున్నాయి. రైతులు వంతుల వారీగా రాత్రిళ్లు పొలాల్లో కాపలా ఉంటున్నారు. పొలం చుట్ట్టూ రంగుల దుస్తులు కట్టి అడవి పందులను పారదోలే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఫలితం లేకుండా పోతోంది.
 
 = ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం దొరిగల్లు, చిన్నకోట్ల, బూదనంపల్లి, కొడవండ్లపల్లి, ఈదులపల్లి, దామానుపల్లి తదితర గ్రామాలు కొండకు ఆనుకుని ఉన్నాయి. ఇక్కడ పందుల బెడద అధికంగా ఉంది. మల్లేపల్లి రూట్‌లోని కోటిరెడ్డిపల్లి, గుట్టకిందపల్లి, రామిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లోనూ పందుల బెడద అధికంగా ఉంది. పందుల నుంచి పంటను కాపాడుకునే ప్రయత్నంలో దొరిగల్లులో మంగళవారం రాత్రి రైతు దంపతులు కరెంట్ షాక్‌కు గురయ్యి మరణించారు. ధర్మవరం మండలంలోని నేలకోట, బుడ్డారెడ్డిపల్లి, నడిమిగడ్డపల్లి, మాలగుండ్లపల్లి, వెంకటతిమ్మాపురం, రావులచెరువు ప్రాంతాలు, బత్తలపల్లి మండలంలోని కాటమకుంట, నల్లబోయనపల్లి, ముద్దనపల్లి, డి.చెర్లోపల్లి, సంగాల, తాడిమర్రి మండలంలోని పెద్దకోట్ల, శివంపల్లి, మోదుగులకుంట, మరవపల్లి, మర్రిమాకులపల్లి, నాయనపల్లి ప్రాంతాల్లోనూ అడవి పందుల పంటలను నాశనం చేస్తున్నాయి.
 
 పాలకులు పట్టించుకోకుంటే రైతులు పంటలు వేయలేరు
 అడవి జంతువుల కారణంగా చాలా చోట్ల అముదం తప్ప వేరే పంటలు సాగుచేసే పరిస్థితి లేదు. గతంలో ఈ సమస్యను జిల్లా పరిషత్ సమావేశంలోనూ లేవనెత్తాం. సమస్య తీవ్రతను అధికారులు, నాయకులు గుర్తించడం లేదు. నేనే ఎనిమిదెకరాలు బీడు పెట్టా. అడవి జంతువుల బారి నుంచి పంటలను కాపాడే చర్యలు తీసుకోకపోతే మున్ముందు జిల్లాలో రైతులు పంటలు సాగు చేసే పరిస్థితి ఉండదు.  
 - తరిమెల శరత్‌చంద్రా రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం
 రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement