భారీ వర్షాలు: పొంగుతున్న నదులు | Heavy Rains In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలు: పొంగుతున్న నదులు

Oct 10 2017 11:25 AM | Updated on Jun 2 2018 3:08 PM

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జన జీవనం స్తంభించింది. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో రాకపోకలను అంతరాయం ఏర్పడింది. అనంతపురం, వైఎస్‌ఆర్‌ , కర్నూలు జిల్లాలలో మంగళవారం భారీగా వర్షం పడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. చెరువులు నిండి ప్రమాదక స్థాయికి చేరుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిత్రావతికి భారీగా వరద
అనంతపురం జిల్లాలో భారీగా వర్షాలు కారణంగా చాలా ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అలాగే ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో చిత్రావతి నదికి భారీగా వరద నీరు వస్తోంది. 

ఉధృతంగా పాపాగ్ని, పెన్నా..
వైఎస్సార్‌ జిల్లాలో గల పాపాగ్ని, పెన్నా, చెయ్యేరు, మాండవ్య నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.  సోమవారం రాత్రి నుంచి  వైఎస్సార్‌ జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. పులివెందుల, జమ్మలమడుగు, కొండాపురం, ప్రొద్దుటూరు, సింహాద్రిపురం, ముద్దనూరు తదితర మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది. గంగాదేవిపల్లె చెరువు నిండి ప్రమాదకరస్థాయిలో ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అలాగే సింహాద్రిపురం మండలం బీసీ కాలనీలోకి వరద నీరు చేరింది.

కొండాపురం మండలం చిన్నపల్లెలోకి తిమ్మాపురం చెరువు వరద నీరు రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక కొండాపురంలో భారీగా కురుస్తున్న వర్షాలకు పాతభవనం ఒకటి కూలిపోయింది. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో పాపాగ్ని, పెన్నా, చెయ్యేరు, మాండవ్య నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాపాగ్ని నది ఉధృతికి అలిరెడ్డిపల్లె గ్రామం వద్దగల కాజ్‌వే కొట్టుకుపోయింది. అలాగే రాయచోటి మూసాపేట వద్ద మాండవ్య నది పొంగిపొర్లుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement