మరింత సరళంగా జీఎస్‌టీ రిటర్నులు | GST returns as more simplistic | Sakshi
Sakshi News home page

మరింత సరళంగా జీఎస్‌టీ రిటర్నులు

Mar 1 2018 4:29 AM | Updated on Sep 27 2018 4:42 PM

GST returns as more simplistic - Sakshi

సాక్షి, అమరావతి: జీఎస్‌టీ రిటర్నుల విధానాన్ని మరింత సరళంగా, సులభలతరం కానుంది. ఈనెల 10న జరిగే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో ఇదే ప్రధాన అజెండాగా చర్చజరగనుంది. రిటర్నుల విధానాన్ని మరింత సరళంగా చేయడం ద్వారా మరింత మందిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడానికి ఏర్పాటు చేసిన కమిటీ తన తుది నివేదికను ఇప్పటికే రూపొందించింది. వ్యాపారులు రిటర్నులు దాఖలు చేయడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జీఎస్‌టీఆర్‌3 స్థానంలో తాత్కాలికంగా జీఎస్‌టీఆర్‌3(బీ)ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ విధానంలో వ్యాపారులు ఇన్‌వాయిస్‌లు జత చేయనవసరం లేకుండా ఎంత వ్యాపారం చేశారు, ఎంత ఐటీసీ రావాలి అన్న విషయాలు పేర్కొంటే సరిపోయేది. కానీ ఈ విధానంలో వ్యాపారులు మోసం చేయడానికి అవకాశాలు ఉండటంతో పాటు పన్ను వసూళ్లు కూడా భారీగా తగ్గుతున్న విషయంపై కూలకంషంగా చర్చించి కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్లు కమిటీలోని సభ్యుడు ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి తెచ్చే విధంగా వచ్చే కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

ఆదాయంలో 21 శాతం వృద్ధి
జనవరి నెలలో రాష్ట్ర జీఎస్‌టీ ఆదాయంలో 21 శాతం వృద్ధి నమోదయ్యింది. గతేడాది జనవరి నెలలో జీఎస్‌టీ రాకముందు రూ.1,286.77 కోట్లుగా ఉన్న ఆదాయం జీఎస్‌టీ వచ్చిన తర్వాత 20.84 శాతం పెరిగి రూ.1,554 .98 కోట్లకు చేరింది. సగటున నెల ఆదాయం రూ. 1,457 కోట్ల ఆదాయం దాటితే కేంద్రం నుంచి జీఎస్‌టీ నష్టపరిహారం రాదు. ఇప్పటి వరకు రాష్ట్రం నష్టపరిహారం కింద కేవలం రూ. 382 కోట్లు మాత్రమే వచ్చింది. దేశమొత్తం మీద జీఎస్‌టీ ఆదాయంలో రాష్ట్రం 5వ స్థానంలో ఉందని అధికారులు చెపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement