ఎస్పీకి ఘన సన్మానం | grandly felicitation to SP | Sakshi
Sakshi News home page

ఎస్పీకి ఘన సన్మానం

Jul 23 2014 3:20 AM | Updated on Sep 2 2017 10:42 AM

ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్‌కు మంగళవారం రాత్రి పోలీస్ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానం చేశారు.

ఒంగోలు క్రైమ్ :  ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్‌కు మంగళవారం రాత్రి పోలీస్ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానం చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీని దుశ్శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి రాధాకృష్ణ పోలీసుల సేవలను కొనియాడారు. ఎస్పీ ప్రమోద్‌కుమార్ అంకితభావంతో విధులు నిర్వహించారన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఎస్పీని పూలమాలలతో ముంచెత్తారు. సిబ్బంది, పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం ఎస్పీ చేపట్టిన కార్యక్రమాలను ఎవరూ మరచిపోలేరని ఏఎస్పీ రామానాయక్ కీర్తించారు. కార్యక్రమంలో ఫాస్ట్‌ట్రాక్ జడ్జితో పాటు పీటీసీ ప్రిన్సిపాల్ సమైజాన్‌రావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 నేడు బాధ్యతలు స్వీకరించనున్న కొత్త ఎస్పీ శ్రీకాంత్
 జిల్లాకు బదిలీపై వస్తున్న ఎస్పీ సీహెచ్ శ్రీకాంత్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్‌లోని ఏసీబీ జాయింట్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఎస్పీగా నియమించిన సంగతి తెలిసిందే. జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీగా బాధ్యతలు తీసుకోనున్న శ్రీకాంత్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
 ఎస్పీకి గౌరవ వందనం
 ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్‌కు మంగళవారం పోలీసులు ఘనంగా గౌరవ వందనం చేశారు. పోలీస్ విభాగాల్లోని అధికారులు, పోలీసులు ఉదయం 6 గంటలకే పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. బదిలీపై వెళుతున్న ఎస్పీకి లాంఛనంగా పోలీస్ పరేడ్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన గుర్రాల రథంపై ఎస్పీ దంపతులను క్వార్టర్స్ నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు ఊరేగింపుగా తీసుకొచ్చారు.

 పోలీస్ బృందాలు దారిపొడవునా పూలతో స్వాగతం పలికారు. పరేడ్ గ్రౌండ్‌లో ఎస్పీ ప్రమోద్‌కుమార్ పోలీస్ కవాతును పరిశీలించారు. అనంతరం గౌరవవందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రామానాయక్, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement