‘తూర్ప’ంతా సంక్రాంతి | grand sankranti festival in Kakinada | Sakshi
Sakshi News home page

‘తూర్ప’ంతా సంక్రాంతి

Jan 16 2014 1:16 AM | Updated on Sep 2 2017 2:38 AM

సంక్రాంతి శోభతో జిల్లా తుళ్లిపడుతోంది. ఎటుచూసినా పండగ వాతావరణం తొణికిసలాడుతోంది. నగరాలు.. పట్టణాలు..

సాక్షి, కాకినాడ :సంక్రాంతి శోభతో జిల్లా తుళ్లిపడుతోంది. ఎటుచూసినా పండగ వాతావరణం తొణికిసలాడుతోంది. నగరాలు.. పట్టణాలు.. పల్లెలనే తేడా లేకుండా అంతటా సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. భోగి మంటలు వేసి భోగి పండగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు భోగి పళ్లు పోశారు. అలాగే బుధవారం సంక్రాంతి పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో నిర్వహించారు. పితృదేవతలను తలచుకొని దానధర్మాలు చేసి నువ్వులతో తర్పణాలు వదిలారు. పలుచోట్ల పితృదేవతల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఇక సంక్రాంతి పర్వదినాల్లో నిర్వహించే జాతరలు.. ప్రభల తీర్థాలతో పల్లెల్లో పండగ వాతావరణం వెల్లివిరుస్తోంది.
 
 పలు ఆలయాల్లో గోదాదేవి కల్యాణాలు నిర్వహించారు. జోరుగా సాగుతున్న కోడిపందాలతో ఆయా ప్రాంతాలు తిరునాళ్లను తలపిస్తున్నాయి. కొత్త అల్లుళ్లు, బంధువులు రాకతో ఇళ్లన్నీ పిల్లాపాపలతో కళకళలాడుతున్నాయి. దేశ విదేశాల్లో స్థిరపడిన వేలాది కుటుంబాలవారు స్వగ్రామాలకు రావడంతో పల్లెవాసుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వంద కుటుంబాలకు చెందిన సుమారు 500 మంది పి.గన్నవరం మండలంలోని స్వగ్రామమైన రాజులపాలెం చేరుకొన్నారు. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాల్లో వారందరూ పాల్గొంటున్నారు. వివిధ గ్రామాల్లో వందలాది మంది ఒకేచోట చేరి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేస్తూ ఆటపాటలతో ఆనందోత్సాహాలతో గడుపుతున్నారు.
 
 కిక్కిరిసిన పర్యాటక ప్రాంతాలు
 పండగ నేపథ్యంలో జిల్లాలోని పర్యాటక ప్రాంతాలన్నీ సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. మారేడుమిల్లి, రంపచోడవరం, అడ్డతీగల వంటి ఏజెన్సీ ప్రాంతాలతో పాటు దిండి, కోరంగి అభయరాణ్యం తదితర పర్యాటక ప్రాంతాలతో పాటు జిల్లాలోని సాగరతీరాలు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన రహదారులన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. నిన్నమొన్నటి వరకూ కిక్కిరిసిపోయిన బస్సులు, ఇతర వాహనాల్లో ప్రయాణికుల సందడి పెద్దగా కానరావడం లేదు.
 
 నేడు కనుమ పూజలు
 వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే పశువులు, పనిముట్లకు కనుమ రోజైన శుక్రవారం పూజలు నిర్వహించనున్నారు. పలు గ్రామాల్లో ప్రభలను ముస్తాబు చేసి ఊరేగింపు నిర్వహించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement