కుందూపై మూడు జలాశయాలు

Government Has Given The Green Signal To Build Three Reservoirs On The Kundu River - Sakshi

కేసీ కెనాల్‌ ఆయకట్టు ఇక సస్యశ్యామలం

జోలదరాశి, రాజోలి వద్ద రెండు రిజర్వాయర్ల నిర్మాణం

రూ.1,669.4 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు

తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణకు

జొన్నవరం వద్ద ఆనకట్ట, ఎత్తిపోతలకు రూ.564.6 కోట్లతో గ్రీన్‌సిగ్నల్‌

రనున్న మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల దాహార్తి

సాక్షి, అమరావతి: కుందూ నదిపై మూడు జలాశయాలను నిర్మించి కేసీ (కర్నూలు–కడప) కెనాల్, తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కుందూ నదిపై కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం జోలదరాశి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ను రూ.312.3 కోట్లతో నిరి్మంచనున్నారు. చాగలమర్రి మండలం రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీల సామర్థ్యం కలిగిన మరో రిజర్వాయర్‌ను రూ.1357.10 కోట్లతో నిరి్మంచనున్నారు. వీటికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ జలాశయాల ద్వారా కేసీ కెనాల్‌ ఆయకట్టును స్థిరీకరించనున్నారు. మరోవైపు కుందూనది నుంచి ఎనిమిది టీఎంసీలను తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన అనుబంధ జలాశయం(ఎస్సార్‌)–1 జలవిస్తరణ ప్రాంతం వద్దకు ఎత్తిపోసి ఆయకట్టు స్థిరీకరించే పనులకు కూడా రూ.564.60 కోట్లతో
పరిపాలనా అనుమతి మంజూరైంది.

కేసీ కెనాల్‌ ఆయకట్టుకు మంచి రోజులు..
►తుంగభద్ర–పెన్నా నదులపై కర్నూలు జిల్లా సుంకేశుల వద్ద డచ్‌ సంస్థ 1873లో ఆనకట్ట నిర్మించింది. అక్కడి నుంచి పెన్నా వరకు కాలువ తవ్వకం పనులను 1880 నాటికి పూర్తి చేసింది. బ్రిటిష్‌ ప్రభుత్వం అదే ఏడాది దీన్ని రూ.3.02 కోట్లకు కొనుగోలు చేసింది. 1933 నుంచి ఈ కాలువ సాగునీటి ప్రాజెక్టుగా మారింది. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కేసీ కెనాల్‌ ఆయకట్టు కింద 2,65,628 ఎకరాల ఆయకట్టు ఉంది. కర్నూలు జిల్లాలో 1,73,627 ఎకరాలు, వైఎస్సార్‌ జిల్లాలో 92,001 ఎకరాల ఆయకట్టు ఉంది.
►బచావత్‌ ట్రిబ్యునల్‌ కేసీ కెనాల్‌కు 39.9 టీఎంసీలను కేటాయించింది. సుంకేశుల బ్యారేజీ వద్ద 29.9 టీఎంసీలు లభ్యమవుతాయని, మిగతా పది టీఎంసీలు తుంగభద్ర జలాశయం నుంచి విడుదల చేయాలని పేర్కొంది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు తుంగభద్రలో సుంకేశుల వద్ద నీటి లభ్యత కనిష్ట స్థాయికి పడిపోవటంతో కేసీ కెనాల్‌ ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందని దుస్థితి నెలకొంది.
►కుందూ వరద ప్రవాహాన్ని ఒడిసిపట్టడం ద్వారా కేసీ కెనాల్‌ ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులను అధిగమించాలని దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా  
►నిర్ణయించారు. ఆ క్రమంలో కుందూ నదిపై రాజోలి, జోలదరాశి జలాశయాల నిర్మాణానికి 2008 డిసెంబర్‌ 23న పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజోలి ఆనకట్టకు దిగువన 84,686 ఎకరాలకు కుందూ వరద ద్వారా నీళ్లందించి మిగతా 1,80,942 ఎకరాలకు సుంకేశుల బ్యారేజీ నుంచి తుంగభద్ర జలాలను అందించడం ద్వారా కేసీ కెనాల్‌ ఆయకట్టును సస్యశ్యామలం చేయాలని భావించారు. వైఎస్సార్‌ హఠాన్మరణంతో రాజోలి, జోలదరాశి జలాశయాలకు గ్రహణం పట్టింది.
►కేసీ కెనాల్‌ ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు ఆ రెండు జలాశయాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు. రిజర్వాయర్ల నిర్మాణంతో రాజోలి జలాశయంలో 6 గ్రామాలు, 9,938 ఎకరాలు ముంపునకు గురవుతాయి. జోలదరాశి జలాశయంలో ఒక గ్రామం, 2,157 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది.

బ్రహ్మం సాగర్‌కు కుందూ జలాలు
►తెలుగుగంగ ప్రాజెక్టులో బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 17.73 టీఎంసీలు. కానీ నీటిని సరఫరా చేసే లింక్‌ కెనాల్‌ సక్రమంగా లేకపోవడంతో బ్రహ్మంసాగర్‌ను నింపలేని దుస్థితి నెలకొంది. ఫలితంగా తెలుగుగంగ ఆయకట్టుకు సరిగా నీళ్లందడం లేదు. మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాలకు కూడా నీటిని సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది.
►ఈ పరిస్థితిని అధిగమించేందుకు కుందూ నదిపై వైఎస్సార్‌ జిల్లా దువ్వూరు మండలం జొన్నవరం వద్ద ఆనకట్ట నిరి్మస్తారు. నదికి వరదలు వచ్చే 65 రోజుల్లో నిత్యం 1,425 క్యూసెక్కుల చొప్పున ఎనిమిది టీఎంసీలను దువ్వూరు చెరువులోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి తెలుగుగంగ ప్రధాన కాలువ 107 కి.మీ వద్ద అనుబంధ జలాశయం–1 (ఎస్సార్‌–1) జల విస్తరణ ప్రాంతం వద్దకు ఎత్తిపోస్తారు. ఆ జలాశయాన్ని నింపి బ్రహ్మంసాగర్‌కు తరలించి తెలుగుగంగ ఆయకట్టుకు నీళ్లందించే పనులకు రూ.564.60 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచి్చంది.  
►దీనిద్వారా తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణతోపాటు మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల ప్రజల దాహార్తి తీరనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top