జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని...
చిత్తూరు(సెంట్రల్): జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్జైన్ సంబందిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ(డీఐపీసీ) సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా పరిశ్రమల స్థాపనకు అనుమతులు మంజూరు చేయడం ద్వారా ఎక్కువమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందన్న విషయాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు.
పరిశ్రమలకు రెవెన్యూ శాఖ ద్వారా మంజూరు చేయాల్సిన అనుమతులకు ప్రత్యేకంగా 3ఐ (ఇండస్ట్రీస్,ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్) సెల్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇకపై కలెక్టరేట్లో వివిధ సెక్షన్లకు తిరిగే అవసరం లేకుండా ఒకే చోట అనుమతులు ఇచ్చేందుకు ఈ సెల్ ఏర్పాటు చేశారన్నారు. తిరుపతి ఆటోనగర్ నీటి సరఫరా కోసం చెల్లించాల్సిన ధరావత్తు మొత్తా న్ని వాయిదా పద్ధతుల్లో చెల్లించేందుకు కలెక్టర్ అనుమతిం చారు. ఈ మేరకు 15 రోజుల్లో తిరుపతి ఆటోనగర్కు నీటి సరఫరాను చేపట్టాలని ఏపీ ఐఐసీ జెడ్ఎం ,ఓఎస్డీ తిరుపతిలను ఆదేశించారు.
ఎస్సీ ఎస్టీ మహిళలకు స్థల కేటాయింపు
గండ్రాజుపల్లె ఈ-పార్క్లో ఫుడ్ కోర్టు స్థాపించేందుకు ఎస్సీ మహిళకు 2510 చదరపు మీటర్లు, మదనపల్లె వలసపల్లి ఈ-పార్క్లో రెడీమెడ్ గార్మెంట్స్ స్థాపనకు ఎస్టీ మహిళకు 890 చదరపు మీటర్ల స్థలం కేటాయించేందుకు డీఐపీసీ ఆమోదించింది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పోరేషన్ వార్షిక రుణ ప్రణాళికను సమీక్షించి ముఖ్యమైన పరిశ్రమలకు రుణసదుపాయం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని, ఇందుకు నోడల్ అధికారిగా పరిశ్రమల కేంద్రం డెప్యూటీ డెరైక్టర్ను నియమిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లాను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని కలెక్టర్ కోరారు. డీఐపీసీ కన్వీనర్,జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామలింగేశ్వరరాజు, ఏపీఐఐసీ ఓఎస్డీ ప్రతాప్, జెడ్ఎం రమణారెడ్డి, డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శశికుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ వీరేంద్రబాబు, చిత్తూరు కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.