ప్రేమించాడు 'గోవింద'... పెళ్లంటే గోవిందా... | Sakshi
Sakshi News home page

ప్రేమించాడు 'గోవింద'... పెళ్లంటే గోవిందా...

Published Tue, Aug 26 2014 9:19 AM

గోవిందతో నిశ్చితార్థం (ఫైల్ ఫొటో) - Sakshi

విజయనగరం (మక్కువ) : ‘ప్రేమించానన్నాడు. ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. కట్నం పేరుతో ఇప్పుడు అడ్డం తిరిగాడు. కట్నం కింద రూ.పది లక్షలు, భూమిని రాసిస్తేనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు’ అంటూ మండల కేంద్రం మక్కువలోని గుళ్లమజ్జివీధికి చెందిన ఉషారాణి వాపోయింది. సోమవారం తన తల్లిదండ్రులు కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.
 
తాను విజయనగరంలో కంప్యూటర్ కోర్సులో కోచింగ్ తీసుకుంటుండగా రామభద్రపురం మండలం తారాపురం గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తుమరాడ గోవిందతో ఏడాదిన్నర కిందట పరిచయమైందని చెప్పిం ది. గత ఏడాది డిసెంబర్ 8న రైల్వే పరీక్షలను రాసేందుకు విశాఖపట్నంలో వెళ్లగా గోవింద కూడా తనతో వచ్చాడని, అనంతరం విజయనగరం తీసుకెళ్లి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి లొంగదీసుకున్నాడని తెలిపింది.
 
 ఈ ఏడాది జూన్ 22న గోవింద తన కుటుంబ సభ్యులను తన ఇంటికి తీసుకొచ్చి నిశ్చితార్థం చేసుకున్నాడని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తన తల్లిదండ్రులు లక్ష రూపాయల అడ్వాన్సు కూడా అందించాని ఉషారాణి తెలిపింది. ఇంతలో గోవింద పెళ్లి ఇష్టం లేదని, నీకన్నా అందమైన అమ్మాయి, కట్నం అధికంగా ఇచ్చే వారు ఉన్నారని వేధించసాగాడని వాపోయింది. రూ.10 లక్షలకట్నం, తన పేరున ఉన్న భూమిని ఇస్తేనే పెళ్లిచేసుకుంటానని వేధించేవాడని ఆవేదన  వ్యక్తం చేసింది. గోవిందపై కేసు నమోదు చేయవద్దని, తనతో వివాహం చేస్తే చాలని ఉషారాణి విజ్ఞప్తి చేసింది.
 
 ఇదే విషయమై ఈ నెల 4న విజయనగరంలో ఎస్పీ నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చే యగా ఆ సమయంలో ఎస్పీ బయటకు వెళ్లారని తెలిపింది. దీంతో ఈ నెల 18న మళ్లీ గ్రీవెన్స్‌లో ఎస్పీకు ఫిర్యాదు చేయడంతో మక్కువ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అక్కడ అధికారులు తెలిపినట్లు ఆమె వివరించింది. ఈ నెల 22న మక్కువ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సమస్య వివరించింది. కాగా, సోమవారం సాలూరు సీఐ దేముళ్లు మక్కువ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని విచారణ చేపట్టారు.
 

Advertisement
Advertisement