కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కుమార్తె శ్రీమణికి చెందిన మెడ్విన్ ఆసుపత్రి భవనాన్ని సీజ్ చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు వెళ్లడంతో అక్కడ కొంత సేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పన్ను బకాయిపై అధికారుల నిర్ణయం
హైదరాబాద్, న్యూస్లైన్: కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కుమార్తె శ్రీమణికి చెందిన మెడ్విన్ ఆసుపత్రి భవనాన్ని సీజ్ చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు వెళ్లడంతో అక్కడ కొంత సేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడి అబిడ్స్ చిరాగ్అలీ లేన్లోని ఉన్న ఈ 11 అంతస్తుల ఆసుపత్రి భవనానికి సంబంధించి శ్రీమణి జీహెచ్ఎంసీకి రూ.71.5 లక్షలు ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. పాత బకాయిలతో కలిపి వెంటనే పన్ను చెల్లించాలని జీహెచ్ఎంసీ 8వ సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ పి. విశ్వనాథ్ నవంబర్ 7న రెడ్నోటీస్ జారీ చేశారు. అయినా యాజమాన్యం పన్ను చెల్లించకపోవడంతో గురువారం డీఎంసీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో 30 మంది సిబ్బంది ఆసుపత్రిని సీజ్ చేసేందుకు అక్కడికి చేరుకున్నారు
. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందికి, జీహెచ్ఎంసీ అధికారులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. రెండు గంటల తర్వాత ఆసుపత్రి యాజమాన్యం రూ.13.3 లక్షలు చెల్లించడంతో వివాదం సద్దుమణిగింది. మిగతా బకాయిలన్నీ వారం రోజుల్లో చెల్లిస్తామని ఆసుపత్రి యాజమాన్యం హామీ ఇవ్వడంతో అధికారులు వెనుదిరిగారు.