ఇంటింటికీ మేలు చేశాం...ఆశీర్వదించండి
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మేలు చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే సహించలేని చంద్రబాబు అడ్డంకులు సృష్టించి నిరుపేద ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో గెలిచిన తరువాత కనీసం ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. మంగళవారం ఉదయం 3, 5వ డివిజన్లో ఆయన ప్రచారం నిర్వహించారు. మిలిటరీ కాలనీ నుంచి బలరాం కాలనీ, పొనుగుపాటి కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, భరత్ కాలనీలలో రోడ్ షో నిర్వహించారు. 5వ డివిజన్లో అగ్జిలియం స్కూలు నుంచి 4వ లైను ఎక్స్టన్షన్ వరకు నిర్వహించిన రోడ్ షోలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. బాలినేని మాట్లాడుతూ నగరంలో 25 వేల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశామని, వచ్చే 9 నెలల్లో ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇస్లాంపేటలో చిన్న వర్షం కురిసినా రోడ్ల మీదకు నీరు చేరేదని, మురికి నీరు కూడా చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడేవారని, కోటి రూపాయలతో డ్రైనేజీ కాలువ నిర్మించడంతో సమస్య పరిష్కారమైందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మించి ఒంగోలు నగరం మొత్తం మురుగు నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో 3వ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి మధు, 5వ డివిజన్ కార్పొరేటర్ పద్మావతి రంగారావు, డివిజన్ అధ్యక్షుడు షేక్ జాఫర్, సత్యనారాయణ రెడ్డి, బొంతా గంగాధర్, మోహన్ రావు, వెంకటరావు, చాపలనాగరాజు, శ్రీకాంత్, తంబి, శ్రీనురెడ్డి, షేక్ సుభాని, రమిజా, జ్యోతి, సుభాని, పేదిరెడ్డి , బాలమ్మ, బాలలక్ష్మి, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్, షాజహాన్ పాల్గొన్నారు.
బాపూజీ కాంప్లెక్స్లో అడుగడుగునా బ్రహ్మరథం:
బాపూజీ కాంప్లెక్స్లో బాలినేని నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వ్యాపారులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. బాలినేని ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర మేయర్ గంగాడ, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, పార్టీ నగర అధ్యక్షుడు కఠారి శంకర్, గొర్రెపాటి శ్రీనివాసరావు, బాపూజీ కాంప్లెక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి సత్యనారాయణ, నాయకులు ఎస్ఆర్ శ్రీనివాసరావు, కే ప్రభాకరరావు, ఇ.సత్య శ్రీనివాసులు, బీ వరదరాజమ్, షౌకత్ అలి, బాషా, ఒంగోలు బుజ్జి, తాతా బదరి పాల్గొన్నారు.