ప్రజలకు పంపిణీ చేసే నిత్యావసర వస్తువుల విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా గోడౌన్లో రూ. లక్షలు విలువైన సరుకులు మగ్గుతున్నాయి.
సాక్షి, కడప : ప్రజలకు పంపిణీ చేసే నిత్యావసర వస్తువుల విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా గోడౌన్లో రూ. లక్షలు విలువైన సరుకులు మగ్గుతున్నాయి. ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు..ఏకంగా ఏడాది కాలంగా రూ. రూ. 60 లక్షల విలువైన సరుకులు మగ్గుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం మిల్లర్లకు అమ్మేందుకు కూడా చొరవ చూపడం లేదు. ఇటీవల జిల్లాకు వచ్చిన పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత ఈ విషయంలో తీవ్రంగా మండిపడినా అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ఏడాదికి కాలంగా గోడౌన్లో..అమ్మహస్తం సరుకులు...
అమ్మహస్తం పథకంలో భాగంగా అప్పటి కిరణ్ సర్కార్ 2013 జనవరిలో 9 వస్తువులకు సంబంధించిన సరుకులను లారీల ద్వారా జిల్లాకు పంపించారు. అప్పట్లో అధికారులు పరిశీలించుకున్నారో లేదో తెలియదుగానీ గోడౌన్లో దించుకుని...తర్వాత తాపీగా చూసుకుంటే ప్రజలకు పంపిణీ చేసే వస్తువుల్లో నాణ్యత లోపించినట్లు స్పష్టమైంది.
2013 జనవరి నుంచి ఇప్పటివరకు గోడౌన్లోనే సరుకులు నిల్వ ఉన్నాయి. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ విషయాన్ని ఇంతవరకు బయటికి పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నా.. ఇటీవలే ఓ సమీక్షా సమావేశంలో బహిర్గతమైంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ఇక్కడి అధికారులు పేర్కొంటున్నారు.
గోడౌన్లో రూ. 60 లక్షల విలువైన సరుకులు
పౌరసరఫరాలశాఖ గోడౌన్లో ఉన్న అమ్మహస్తం సరుకులు నాణ్యతగా లేవని ఏడాది కాలంగా అక్కడే ఉంచారు. చింతపండు 47.690 టన్నులు...దీని విలువ దాదాపు రూ. 33,59,354, కారంపొడి 21.274 టన్నులు..దీని విలువ రూ. 20,64,428, పసుపు 5.474 క్వింటాళ్లు కాగా దీని విలువ రూ. 5,47,900 కలుపుకుంటే దాదాపు రూ. 60 లక్షల విలువైన సరుకులు గోడౌన్లో ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రి మందలించినా....
గోడౌన్లో ఉన్న సరుకుల విషయం బయటపడి పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత స్వయంగా జిల్లా అధికారులను మందలించినా మార్పు కనిపించడం లేదు. సరుకులను మిల్లర్లకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అయినా ఇంతవరకు పురోగతి కనిపించడం లేదు. గతంలో ఎండీ స్థాయి అధికారులకు తెలిపినా పట్టించుకో లేదని.. మా తప్పేమి లేదని..మాకేమి కాదంటూ కొంతమంది అధికారులు కార్యాలయంలోనే కూర్చొని లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం.
అయితే ఎండీ స్థాయి అధికారికి తెలిపినా ఎందుకు అలాగే గోడౌన్లోనే నిల్వ పెట్టించారన్న విషయం అర్థం కావడం లేదు. సరుకులో నాణ్యత లోపించిన సందర్భంలో మిల్లర్లకు విక్రయించడమో, లేకపోతే వెనక్కి తెప్పించుకోవడమో జరుగుతుందని... అలాగే గోడౌన్లో నిల్వ చేయడం వల్ల సరుకులు మరింత క్షీణించి నాణ్యత మరింత తగ్గుతుందని శాఖకు చెందిన సిబ్బందే చెప్పుకుంటున్నారు.
అమ్మినా కొనుగోలు చేసేవారు కరువే
చింతపండు, కారంపొడి, పసుపు గోడౌన్కు వచ్చి ఏడాదిన్నర దాటింది. ఇన్ని రోజులు గోడౌన్లో నిల్వ చేసిన సరుకులలో నాణ్యత ఎంతవరకు ఉంటుందన్నది ప్రశ్నార్థకం. పౌరసరఫరాలశాఖ అధికారులు విక్రయించేందుకు సిద్ధపడినా కొనుగోలు చేసేందుకు మిల్లర్లు రావడం అనుమానంగా మారింది. అధికారులు మాత్రం ఎవరో ఒకరు వస్తే ఎంతో కొంతకు అమ్మేస్తామని పేర్కొంటున్నా....కర్ణాటక, అనంతపురం ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యాపారులు చింతపండును కేవలం కిలో రూ. 16 చొప్పున సరుకులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరు కూడా అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం.
జిల్లా మేనేజర్ ఏమంటున్నారంటే!
ప్రస్తుతం గోడౌన్లో రూ. 50 లక్షలకు పైగా విలువ చేసే చింతపండు, కారంపొడి, పసుపు నిల్వలున్న ఉన్న మాట వాస్తవమే. నాణ్యత లేకపోవడంతో ఏడాది కాలంగా ఇక్కడే ఉంచాం. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. ఎవరైనా మిల్లర్లు ముందుకొస్తే విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాం.
- బుల్లయ్య, జిల్లా మేనేజర్, పౌరసరఫరాలశాఖ,కడప
నేడు ఎండీతో సమావేశం
హైదరాబాదులోని సోమాజిగూడలో ఉన్న సివిల్ సప్లయ్ కార్యాలయంలో ఎండీ అనిల్కుమార్తో సోమవారం జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులకు సమావేశం జరగనుంది.జిల్లాకు సంబంధించిన గోడౌన్లతోపాటు స్టాకు నిల్వల విషయం, ఇతర అనేక అంశాలపై ఎండీతో జిల్లా అధికారులు చర్చించనున్నట్లు తెలియవచ్చింది.