నిరసనల జోరు | Employees of various departments held a massive rally | Sakshi
Sakshi News home page

నిరసనల జోరు

Aug 31 2013 4:57 AM | Updated on Sep 1 2017 10:17 PM

జిల్లాలో 31వ రోజు సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగింది. నగరంలో వివిధ శాఖల ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. నాయకులకు కనువిప్పు కలిగేలా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని డీఆర్‌ఓ రామిరెడ్డి ప్రకటించారు.

సాక్షి, నెల్లూరు :  జిల్లాలో 31వ రోజు సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగింది. నగరంలో వివిధ శాఖల ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. నాయకులకు కనువిప్పు కలిగేలా  ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని డీఆర్‌ఓ రామిరెడ్డి ప్రకటించారు.  కోవూరు మండలం ఇనమడుగులో  అధికారులు, ఉపాధ్యాయులు తిరిగి సమైక్యాంధ్రతో ప్రయోజనాలను వివరించారు. ఎన్జీఓ హోంలో వికలాంగుల నిరాహార దీక్ష చేపట్టారు. కొడవలూరు మండలంలోని ఎల్లాయపాళెంలో అధికారులు, టీచర్లు సమైక్యాంధ్రపై అవగాహన కల్పించేందుకు గ్రామసభను ఏర్పాటు చేశారు. ఇందుకూరుపేట  మండలంలో అధికారులు సమైక్యాం ధ్రపై గ్రామసభ నిర్వహించారు.
 
  వెంకటగిరిలో  పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి రాజావీధి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు.
 
  ఉదయగిరిలో సమైక్యాంధ్ర, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో  రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు. మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల జేఏసీ ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో మూడో రోజు దీక్ష కొనసాగుతోంది.
 
 విద్యార్థులు రోడ్డుపై కళ్లకు గంతలు కట్టుకుని డ్రాయింగ్ వేశారు. పంచాయతీ బస్టాండ్ సెంటర్‌లో వికలాంగుల ఆధ్వర్యంలో రెండోరోజు దీక్షలు కొనసాగాయి. బస్టాండ్ సెంటర్‌లో సమైక్యాంధ్ర, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పోరాట సమితి ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ సొసైటీ, జన విజ్ఞానవేదిక సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించాయి. ముస్లిం కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌సొసైటీ ఆధ్వర్యంలో ముస్లింలు పాఠశాలలు, దుకాణాలు మూసివేయించి బంద్ నిర్వహించారు.  
 
  ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ సెంటర్‌లో విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్న  రిలే నిరాహార దీక్ష 20వ రోజుకు చేరింది.
 
  మనుబోలులో హైవేపై సమైక్యవాదులు ప్రదర్శన జరిపి, రాస్తారోకో చేశారు. పొదలకూరులో  ఆటోల ర్యాలీ నిర్వహించారు. వెంకటాచలం మండలంలోని కనుపూరు, కందలపాడు గ్రామాల్లో ఉపాధ్యాయులు గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు. గూడూరులో వైద్యులు టవర్‌క్లాక్ సెంటర్‌లో వైద్యశిబిరం ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. టీచర్లు ముగ్గులు వేసి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. కోటలో డీఈఓ మువ్వా రామలింగం  మాట్లాడుతూ  రాజీ నామా చేయని వారు చరిత్ర హీనులు గా మిగిలిపోతారన్నారు. కోట, వాకా డు, చిట్టమూరు మండలాల్లో ర్యాలీలు జరిగాయి. గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సర్పంచ్‌లకు మండల పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.  కావలిలో  జేఏసీ శిబిరంలో కొత్తపల్లి, కొండాపురం పీహెచ్‌సీల సిబ్బంది రిలేనిరాహారదీక్ష చేపట్టారు.  
 
  తడలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలకు మద్దతుగా మండల రెవెన్యూ ఉద్యోగులు రిలే దీక్షలో కూర్చున్నారు.  నాయుడుపేట జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలో  ఉన్న రెవెన్యూ  ఉద్యోగులకు  ఆర్డీవో వెంకటరమణ సంఘీభావం తెలిపారు. విద్యార్థులు కేసీఆర్ శవయాత్ర చేసి బస్టాండ్‌లో దిష్టిబొమ్మను దహనం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement