పరిశోధనల్లో ఎలక్ట్రానిక్స్ పాత్ర కీలకం | Sakshi
Sakshi News home page

పరిశోధనల్లో ఎలక్ట్రానిక్స్ పాత్ర కీలకం

Published Thu, Feb 6 2014 1:58 AM

Electronics research role

  • కేయూ రిజిస్ట్రార్ సాయిలు
  • ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఒక రోజు వర్క్‌షాప్
  • కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : వివిధ అంశాలపై ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్లో కీలకభూమిక పోషిస్తున్న ఎలక్ట్రానిక్స్ విభాగం ఇంజినీరింగ్ పరిశోధనల్లో కూడా ప్రముఖంగా మారిందని కాకతీయ యూనివర్సిటీ  రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ‘డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్’ అంశంపై బుధవారం ఒక రోజు వర్‌‌కషాప్ ఏర్పాటుచేశారు.

    క్యాంపస్‌లోని సెనేట్ హాల్‌లో జరిగిన ఈ వర్‌‌కషాప్‌లో సాయిలు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ దేశభద్రతకు సంబంధించిన రక్షణరంగంలో ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఉపయోగిస్తుండడంతో అనేక మార్పులు సం భవించాయని వివరించారు. ప్రపంచ దేశాలన్నింటిలో కంటే మన దేశంలో యువత శాతం ఎక్కువగా ఉందని, వారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, శ్యాంపిట్రోడాను స్ఫూర్తిగా తీసుకుని తాము ఎంచుకున్న రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరాలని సూచించారు. కాగా, మైక్రోసాఫ్ట్ అధినేతగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సత్య నాదెళ్ల ఎంపిక కావడం అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.
     
    క్షిపణి తయారీలో ఎన్నో దశలు
     
    సాంకేతిక, రక్షణ రంగాలకు అవసరమైన క్షిపణుల తయారీలో ఎన్నో దశలు ఉంటాయని అగ్ని-5 క్షిపణి ప్రాజెక్టు డెరైక్టర్ డాక్టర్ ఆర్‌కే.గుప్తా తెలిపారు. వర్‌‌కషాప్‌కు హాజరైన ఆయన క్షిపణి తయారీ టెక్నాలజీ - దశలు అంశంపై కీలకోపన్యాసం చేశారు. అనంతరం శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్.వరదరాజన్ మాట్లాడుతూ దేశానికి ఆర్థిక, రక్షణ రంగాలే కీలకమని తెలిపారు. దేశ రక్షణ వ్యవస్థకు అవసరమైన రాడార్, కమ్యూనికేషన్ మిసైల్ వంటి రంగాల్లో ఎలక్ట్రానిక్స్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

    కేయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు, పరిశోధకులకు ఎలక్ట్రానిక్స్ రంగంపై అవగాహన కల్పించేందుకు వర్‌‌కషాప్ నిర్వహించామని పేర్కొన్నారు. వర్క్‌షాప్ ప్రారంభసభలో కన్వీనర్ ఎండీ.ఇక్బాల్ ఆసిం, కిట్స్ ప్రిన్సిపాల్ కె.అశోక్‌రెడ్డి, అధ్యాపకులు ఇ.హరికృష్ణ, డాక్టర్ ఇ.మణీందర్, ఎస్.రమణ, ఎం.సదానందం, వి.మహేందర్, సీహెచ్.రాధిక, సుమలత, జె.రాంచందర్, కె.రాజేశ్‌రెడ్డి, టి.స్వప్న, పి.సంతోష్, బి.శ్రీలత, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన టెక్నికల్ సెషన్లలో ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ వరదరాజన్, డీఆర్‌డీఓ శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మీశాంభవి, ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ టీఎస్‌సీ.శర్మ, ఈసీఐఎల్ టెక్నికల్ మేనేజర్ డాక్టర్ అశోక్‌కుమార్ తదితరులు వివిధ అంశాలపై మాట్లాడారు.
     

Advertisement
Advertisement