ఓట్ల తొలగింపుపై ఈసీ సీరియస్‌

Election Commission Serious On Removing Of Votes Issue In AP - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఎలక్షన్‌ కమిషన్‌(ఈసీ) సీరియస్‌ అయ్యింది.  ఓట్ల తొలగింపుకు సంబంధించి తప్పుడు ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్లకు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల్‌ కృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై ఆదివారం గోపాల్‌ కృష్ణ ద్వివేది మాట్లాడుతూ.. వారం కిందట వేల సంఖ్యలో ఓట్ల తొలగింపునకు ఫారం-7  అప్లికేషన్లు వచ్చినట్లు ఈసీ గుర్తించిందన్నారు. ఆన్‌లైన్‌లో గుంపగుత్తగా ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపారు. ఓటర్లకు తెలియకుండా ఓట్లు తొలగించాలంటూ వచ్చిన దరఖాస్తులపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 9 జిల్లాల్లో 45 కేసులు నమోదు చేశామని చెప్పారు. 

ఓటర్ల తొలగింపు సమాచారం తెలిస్తే ఎన్నికల సంఘానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీడాక్‌ సహకారంతో ఐపీ అడ్రస్‌ల ఆధారంగా బాధ్యుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 6 మీ-సేవా కేంద్రాలపై కూడా కేసులు పెట్టినట్లు వెల్లడించారు. ఫారం-7 దరఖాస్తులపై సమగ్ర విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. అనుమతి లేకుండా ఓట్లు తొలగించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.  ఓట్ల తొలగింపు ఫిర్యాదులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top