రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలంలోని దామస్తాపూర్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో గ్రామంలోని ప్రజలు హడలిపోయారు.
మర్పల్లి(రంగారెడ్డి జిల్లా), న్యూస్లైన్: రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలంలోని దామస్తాపూర్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో గ్రామంలోని ప్రజలు హడలిపోయారు. భయంతో రోడ్లపైకి పరుగుపెట్టారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ గ్రామంలో 2,800 మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది.
మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో పెద్ద శబ్దంతో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో గాఢనిద్రలో ఉన్న జనమంతా ఉలిక్కిపడి లేచి రోడ్లపైకి పరుగుతీశారు. ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితుల్లో రాత్రంతా జాగారం చేశారు. ఇతర గ్రామాల్లో ఉంటున్న తమ బంధువులు, పరిసర గ్రామాలవారికి ఫోన్లు చేశారు. గత నెలరోజుల్లో 8 సార్లు భూమి నుంచి శబ్దాలు వినిపించినట్టు గ్రామ మాజీ సర్పంచ్ ఎం.పాండురంగారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఇందుకు గల కారణం అంతుపట్టక గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారని ఆయన చెప్పారు.