breaking news
M. Panduranga reddy
-
భూకంపమే.. అయినా భయం వద్దు
మర్పల్లి, న్యూస్లైన్: మర్పల్లి మండల పరిధిలోని దామస్తాపూర్లో ఆదివారం సంభవించింది భూ ప్రకంపనలు కాదని, భూ కంపమేనని ఎన్జీఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే ఈ భూకంపం వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని వారు గ్రామస్తులకు అభయమిచ్చారు. గత కొద్దిరోజులుగా గ్రామంలో భూప్రకంపనలు, భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే అధికారుల సూచన మేరకు సోమవారం ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు డాక్టర్ ఆర్కే చందా, డాక్టర్ శ్రీ నాగేష్లు దామస్తాపూర్ను సందర్శించారు. భూప్రకంపనలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మూడు నెలలుగా భూమి నుంచి బ్లాస్టింగ్ మాదిరిగా శబ్దాలు వస్తున్నాయని సర్పంచ్ స్వరూప యాదవరెడ్డి, మాజీ సర్పంచ్ పాండురంగారెడ్డి శాస్త్రవేత్తలకు వివరించారు.గత మంగళవారం రాత్రి భారీగా శబ్దం రావటంతో ఇళ్ల నుంచి ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారని, ఆదివారం మధ్యాహ్నం 1.37 నిమిషాలకు భారీ శబ్దం రావటంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ చందా మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం 1.37 గంటలకు వచ్చిన భూ ప్రకంపనం ఒక్కటి తమ కార్యాలయంలో నమోదైందన్నారు. గతంలో కిలారి, నాందేడ్ వంటి ప్రాంతాల్లో వచ్చిన భూకంప తీవ్రతకంటే ఆదివారం జరిగిన తీవ్రత తక్కువ ఉన్నందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. గ్రామంలో ఆదివారం వచ్చిన భూకంప తీవ్రత ఒకటిగా నమోదుకావటంతో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదుని శాస్త్రవేత్త డాక్టర్ శ్రీ నాగేష్ పేర్కొన్నారు. ఇక ముందు గ్రామంలో ప్రజలు కొంత కాలం పాటు.. వీలైనంతవరకు తేలిక పాటి ఇళ్లలో (సిమెంట్ రేకుల ఇళ్లు) ఉండాలన్నారు. ఇకముందు ఏవిధంగా ప్రకంపనలు వస్తున్నాయి అనే విషయాలను పసిగట్టే పరికరాలను గ్రామంలో ఏర్పాటు చేస్తామన్నారు. పరికరం పసిగట్టిన వివరాలను అధ్యయనం చేసి నివేదికను జిల్లా జాయింట్ కలెక్టర్కు అందజేస్తామన్నారు. భూమి 10 సెకండ్ల కంటే తక్కువ సమయం కంపిస్తే ఎలాంటి ప్రమాదం ఉందదన్నారు. పరిశోధన పరికరాలు అమర్చాం: డాక్టర్ ఆర్కే చందా దామస్తాపూర్లో భూప్రకంపనల తీరుతెన్నులను తెలుసుకునేందుకు ఇక్కడ ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేసినట్లు ఎన్జీఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.కే చందా తెలిపారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పరికరాలు అమర్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక పరికరాలను ఒక వారం రోజులపాటు గ్రామంలోనే ఉంచుతామన్నారు. తద్వారా ప్రకంపనల తీవ్రత నమోదవుతుందన్నారు. పరిశోధన పరికరాలు ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఎలాంటి భారీ శబ్ధాలు చేయవద్దన్నారు. భూమిలోని శబ్ధతరంగాల తీవ్రత స్పష్టంగా తెలియాలంటే పరికరాలు అమర్చిన ప్రాంతంలో ప్రజలు కాస్త నిశ్శబ్ధ వాతావరణం కల్పించాలని సూచించారు. -
దామస్తాపూర్లో భూప్రకంపనలు
మర్పల్లి(రంగారెడ్డి జిల్లా), న్యూస్లైన్: రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలంలోని దామస్తాపూర్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో గ్రామంలోని ప్రజలు హడలిపోయారు. భయంతో రోడ్లపైకి పరుగుపెట్టారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ గ్రామంలో 2,800 మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో పెద్ద శబ్దంతో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో గాఢనిద్రలో ఉన్న జనమంతా ఉలిక్కిపడి లేచి రోడ్లపైకి పరుగుతీశారు. ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితుల్లో రాత్రంతా జాగారం చేశారు. ఇతర గ్రామాల్లో ఉంటున్న తమ బంధువులు, పరిసర గ్రామాలవారికి ఫోన్లు చేశారు. గత నెలరోజుల్లో 8 సార్లు భూమి నుంచి శబ్దాలు వినిపించినట్టు గ్రామ మాజీ సర్పంచ్ ఎం.పాండురంగారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఇందుకు గల కారణం అంతుపట్టక గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారని ఆయన చెప్పారు.