ఫీజులు.. చెల్లిస్తారా? | Doubt on Fee reimbursement and Scholarships | Sakshi
Sakshi News home page

ఫీజులు.. చెల్లిస్తారా?

Jun 7 2014 12:57 AM | Updated on Oct 2 2018 7:58 PM

ఫీజులు.. చెల్లిస్తారా? - Sakshi

ఫీజులు.. చెల్లిస్తారా?

2013-14 విద్యా సంవత్సరం ముగిసింది. ఈ నెల నుంచే కొత్త విద్యా సంవత్సరం కూడా మొదలవుతోంది.

సాక్షి, హైదరాబాద్/నెట్‌వర్క్: 2013-14 విద్యా సంవత్సరం ముగిసింది. ఈ నెల నుంచే కొత్త విద్యా సంవత్సరం కూడా మొదలవుతోంది. కానీ విద్యార్థులకు చెల్లించాల్సిన పాత విద్యా సంవత్సరం బాపతు ఫీజులే ఇప్పటికీ పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విషయమై అయోమయం రాజ్యమేలుతోంది. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన సర్కారు వాటిపై తన మనోగతాన్ని ఇప్పటిదాకా తేటతెల్లం చేయలేదు. దాంతో 2013-14 ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదలవుతాయో, లేదో తెలియక కాలేజీల యాజమాన్యాలు, కాలేజీల్లో తమను చదవనిస్తారో, లేదో అర్థం కాక విద్యార్థులు... ఇలా అందరిలోనూ ప్రస్తుతం అయోమయమే నెలకొంది. 
 
జిల్లా స్థాయిల్లో సంక్షేమ శాఖ అధికారులు మొదలుకుని సచివాలయ స్థాయిలో బడ్జెట్ విడుదల చేసే ఉన్నతాధికారుల దాకా అందరూ రీయింబర్స్‌మెంట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణమన్న ఆరోపణలున్నాయి. విద్యా సంవత్సరం మొదలైన ఆరు నెలల నుంచే బడ్జెట్ విడుదల ప్రక్రియను ప్రారంభిస్తే ఈపాటికి బకాయిలతో సహా చెల్లింపులన్నీ పూర్తయ్యేవని విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా అంటున్నాయి. 
 
‘‘కానీ అధికార యంత్రాంగం పట్టించుకోకుండా ఆషామాషీగా వ్యవహరించింది. దాంతోవచ్చే సంవత్సరం బడ్జెట్‌ను సర్దినా ఇంకా వేల కోట్లు బకాయిలుగా మిగిలే పరిస్థితి తలెత్తింది’’ అని ఆరోపిస్తున్నాయి. మరోవైపు జూన్‌లో కొత్తగా ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లు మొదలవనున్నాయి. తరవాత ఇంజనీరింగ్, మెడికల్, పీజీ కోర్సులకు కూడా ప్రవేశాలుంటాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించి కొత్తగా దరఖాస్తులను ఆహ్వానిస్తుందా, లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ సర్కారు ‘కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య’ అన్న తన ఎన్నికల హామీని రీయింబర్స్‌మెంట్‌కు వర్తింపజేస్తుందా, లేక కొత్తగా ఏదైనా పథకాన్ని అమలు చేస్తుందా అన్నది చూడాలి.
 
 14.25 లక్షల దరఖాస్తులకు రూ.1,100 కోట్ల విడుదల
 
 2013-14 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం తెలంగాణలోని 10 జిల్లాల నుంచి 14. 25 లక్షల దరఖాస్తులు అందాయి. వాటిలో 12.14 లక్షలే పరిశీలనకు నోచుకున్నాయి. వాటిలోనూ 10,23,094 దరఖాస్తులకు మాత్రమే ఫీజులు మంజూరయ్యాయి. మిగతా 2 లక్షల దరఖాస్తులు విద్యా సంవత్సరం ముగుస్తున్నా జిల్లా అధికారుల వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. పైగా ఆ 10.23 లక్షల దరఖాస్తులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ (ఆర్‌టీఎఫ్), స్కాలర్‌షిప్‌లు(ఎంటీఎఫ్) మంజూరైనట్టు సంక్షేమ శాఖ అధికారులు సాంకేతికంగా చెబుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో అవి కాలేజీలకు పూర్తిగా చేరలేదని తెలుస్తోంది. 
 
బిల్లుల తయారీలో గందరగోళం, జిల్లా సంక్షేమ శాఖల  నుంచి అరకొర సమాచారం వంటి కారణాల వల్ల 2013-14కు గాను ఇప్పటిదాకా రూ.1,100 కోట్లు మాత్రమే విద్యార్థుల పేరిట ఆయా కాలేజీలకు చేరాయి. కానీ దరఖాస్తు చేసుకున్న 14.25 లక్షల విద్యార్థులకు చెల్లించాల్సిన అంచనా మొత్తం రూ.2,500 కోట్లపైనేనని సంక్షేమ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ట్రెజరీల్లో, ఇతరత్రా బిల్లుల రూపంలో రూ.300 కోట్ల వరకు పెండింగ్‌లో ఉంది. అలా చూసుకున్నా ఈ ఆర్థిక సంవత్సరానికే మరో రూ.1,000 కోట్లకు పైగా కాలేజీలకు బకాయిల రూపంలోనే చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఒక్క రంగారెడ్డి జిల్లాలోని కాలేజీలకే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో సుమారు రూ.300 కోట్ల ఫీజులు బకాయి ఉన్నట్టు సమాచారం.
 
 అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి
 ఇంటర్, డిగ్రీతో పాటు ఇంజినీరింగ్, మెడికల్ తదితర వృత్తి విద్యా కళాశాలలు రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా (1,046) ఉన్నాయి. వాటిలో 3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో బీసీ కేటగిరీలో రూ.169 కోట్ల ఫీజు రియింబర్స్‌మెంట్, రూ.39 కోట్ల స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 83.5 కోట్లు అందాల్సి ఉంది.
 
 - కరీంనగర్ జిల్లాలో మొత్తం 425 కాలేజీలకూ 2013-14 బకాయిలు రావాల్సి ఉంది. బీసీ విద్యార్థులకు రూ.35 కోట్లు, ఈబీసీకి రూ.8 కోట్లు, ఎస్సీ కేటగిరీలో రూ.5.7కోట్లు, ఎస్టీలకు రూ.4 కోట్ల బకాయిలున్నాయి.
 
 - ఆదిలాబాద్ జిల్లాలో 79,893 మంది విద్యార్థులు ఆన్ లైన్‌లో బోధన రుసుం, స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటే రూ.43.71కోట్లు విడుదల చేశారు. వాటిని 59,842 మంది విద్యార్థులకు మొదటి విడతగా సర్దారు. వీరికి చెల్లించాల్సిన రెండో విడతతో పాటు మిగతా 20,056 మందికి కలిపి మరో రూ.43.71 కోట్లు అవసరం.
 
- వరంగల్ జిల్లాలో ఒక్క బీసీ కేటగిరీ నుంచే 1,09.527 మంది ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 38,569 మందికే రూ.50.94 కోట్లు విడుదలయ్యాయి. 70,958 మంది విద్యార్థులకు గాను రూ.79.23 కోట్లు అందాల్సి ఉంది. ఈబీసీ కేటగిరీలో రూ.11.69 కోట్లు, ఎస్టీ కోటాలో రూ.9 కోట్ల బకాయిలున్నాయి.
 
 - నల్లగొండ జిల్లాలో 2013-14లో కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఫ్రెషర్స్ ఎవరికీ రీయింబర్స్‌మెంట్ జరగలేదు. రెన్యువల్ విద్యార్థులకు మాత్రమే చెల్లించారు. బీసీలకు రూ.35 కోట్లు, ఎస్సీలకు రూ.5 కోట్లు, ఎస్టీలకు రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉంది.
 
 - నిజామాబాద్ జిల్లాలోనూ ఫ్రెషర్స్‌కు ఫీజులు చెల్లించలేదు. ఎస్టీ కేటగిరీలోని 3,949 మంది విద్యార్థులకు రూ.3 కోట్లు, బీసీ కేటగిరీలోని 23,787 మంది విద్యార్థులకు రూ.15.25 కోట్లు, ఈబీసీలకు రూ.3.25 కోట్లు చెల్లించాల్సి ఉంది.
 
- ఖమ్మం జిల్లాలో సుమారు 20 వేల మంది బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ కింద రూ.24 కోట్ల దాకా చెల్లించాల్సి ఉంది.
 
 - మహబూబ్‌నగర్ జిల్లాలో 17,615 మంది విద్యార్థులకు నయా పైసా కూడా అందలేదు. మంజూరైన రూ.16.09 కోట్లు కూడా మార్చి నెలాఖరులో ఫ్రీజింగ్ కారణంగా ట్రెజరీ ఆంక్షలతో వెనక్కెళ్లాయి. రూ.10 కోట్లకు పైగా ఫీజులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం.
 
- మెదక్ జిల్లాలో బీసీ కేటగిరీ కింద రూ.6.9 కోట్లు చెల్లించాల్సి ఉంది
 
 - హైదరాబాద్ జిల్లాలో కూడా రూ.30 కోట్ల ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement