దగా.. | Dishonesty .. | Sakshi
Sakshi News home page

దగా..

Mar 15 2015 2:49 AM | Updated on Oct 1 2018 2:00 PM

అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల బారిన పడి నష్టపోయిన రైతుల నోళ్లలో ప్రభుత్వం మట్టి కొట్టింది.

కర్నూలు అగ్రికల్చర్ : అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల బారిన పడి నష్టపోయిన రైతుల నోళ్లలో ప్రభుత్వం మట్టి కొట్టింది. ఏళ్ల తరబడి ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్న రైతుల ఆశలను నీరుగార్చింది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కోసం అవి చేస్తాం, ఇవి చేస్తామంటూ ఎన్నో, ఎన్నెన్నో వాగ్దానాలు చేసి అధికారం చేజిక్కించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు క్రమంగా రంగులు మారుస్తున్నారు. 2009 నుంచి 2013-14 వరకు అతివృష్టి, అనావృష్టి వల్ల జరిగిన పంట నష్టానికి ఎటువంటి ఇన్‌పుట్ సబ్సిడీ లేదని  ప్రకటించి వేలాది మంది రైతుల నోళ్లలో మట్టి కొట్టింది. నిబంధనల ప్రకారం ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటలకు నష్టం జరిగితే తగిన పెట్టుబడి రాయితీ(ఇన్‌పుట్ సబ్సిడీ) ఇవ్వాల్సి ఉంది.

50 శాతం ఆపైన దెబ్బతిన్న పంటలన్నింటికి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో 2009 నుంచి 2013-14 వరకు ఇన్‌పుట్ సబ్సిడీ దాదాపు రూ.9 కోట్లు రావాల్సి ఉంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాజకీయాలకు అతీతంగా ఇన్‌పుట్  సబ్సిడీని విడుదల చేయాల్సి ఉంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం రైతు ప్రయోజనాలకు గండి కొడుతోంది. రాష్ట్ర విభజన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదనే సాకుతో ఇన్‌పుట్ సబ్సీడీకి గండి కొడుతోంది. జనవరిలో చంద్రన్న సంక్రాంతి కానుకల పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేదనే కారణంతో ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు దూరం చేస్తోంది.

2013-14 వరకు ప్రకృతి వైపరిత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎటువంటి ఇన్‌పుట్ సబ్సిడీ లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు ఇచ్చారు. అంటే జిల్లాలో దాదాపు 1.50 లక్షల మంది రైతులు రూ.9 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని కోల్పోయారు. ఇక 2013-14 వరకు అతివృష్టి, అనావృష్టి వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ లేదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని వ్యవసాయాధికారులు సాక్షితో చెప్పారు.
 
2014-15 కరువుకు ఇన్‌పుట్ సబ్సిడీ ఏది..
2014 సంవత్సరంలో జిల్లాలో ఏర్పడిన కరువుకు సంబంధించి ప్రభుత్వం మొదటి విడతలో 12 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. అయితే ఈ మండలాలకు కూడా ఇన్‌పుట్ సబ్సిడీ లేకుండా పోయింది. ప్రభుత్వం ఒకవైపు 12 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించగా, మరోవైపు మండల స్థాయి అధికారులు మా మండలాల్లో కరువు లేదు. సాగు బాగుంది, దిగుబడులు బాగా వచ్చాయంటూ నివేదికలు ఇచ్చారు. ఇలా 12 మండలాల అధికారులు ఇదే విధంగా నివేదికలు ఇచ్చారు.

దీంతో 12 కరువు మండలాల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ లేదని జేడీఏ ఠాగూర్‌నాయక్ స్పష్టంగా తెలిపారు. ఎన్నో వాగ్దానాలతో అధికారం చేపట్టిన చంద్రబాబు రైతులను అడుగడుగునా దగా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇన్‌పుట్ సబ్సిడీకి స్వస్తి పలికారు. రుణమాఫీ అయోమయంలో పడింది. మొదటి విడతలో అరకొరగా మాఫీ చేసిన ప్రభుత్వం రెండవ విడత మాఫీ గురించి ఆలోచించడమే లేదు. ఇన్‌పుట్ సబ్సిడీకి ఎగనామం పలకడాన్ని నిరసిస్తూ రైతు సంఘాలు ఆందోళనలకు సిద్ధం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement