ఇజ్రాయేల్‌లో ఇద్దరు తెలుగువారి అదృశ్యం | Disappearance Of Two Telugu People In Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయేల్‌లో ఇద్దరు తెలుగువారి అదృశ్యం

Dec 20 2019 5:28 AM | Updated on Dec 20 2019 5:28 AM

Disappearance Of Two Telugu People In Israel - Sakshi

సంతబొమ్మాళి (శ్రీకాకుళం జిల్లా): ఇజ్రాయేల్‌ దేశానికి విహార యాత్రకు వెళ్లిన ఇద్దరు తెలుగువారు ఐదు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. ఈనెల 20తో వారి వీసా గడువు ముగియనుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం గొలుగువానిపేటకు చెందిన గొల్ల శ్రీనివాసరావు (35), తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన తరుణ్‌ కుమార్‌తోపాటు 43మంది టూరిస్ట్‌ వీసాతో ఇజ్రాయేల్‌ వెళ్లారు. ముంబైకి చెందిన కేసరి టూర్స్‌ ద్వారా ఈనెల 8వ తేదీ రాత్రి ముంబైలో విమానం ఎక్కారు.

ఈ నెల 13 వరకు జోర్డాన్‌ పరిసర ప్రాంతాల్లో తిరిగి 14న ఇజ్రాయేల్‌ చేరుకున్నారు. ఆ రోజు రాత్రి అందరితోపాటు భోజనం చేసిన తరువాత శ్రీనివాసరావు, తరుణ్‌ వారి గదులకు వెళ్లారు. మరుసటి రోజు ఉదయం యాత్రకు రాకపోవడంతో ట్రావెల్‌ సిబ్బంది వారుంటున్న గదులను పరిశీలించారు. అక్కడ లేకపోవడం, ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఎక్కడికో వెళ్లి ఉంటారనుకొని ఎదురుచూశారు. ఫలితం లేకపోవడంతో 16న అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై శ్రీకాకుళం జిల్లా గొలుగువానిపేటలో ఉంటున్న బాధితుడు శ్రీనివాసరావు భార్య రాజులమ్మకు టూరిస్ట్‌ ఏజెంట్‌ సమాచారమివ్వడంతో ఆమె గురువారం సంతబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు

Advertisement
 
Advertisement
Advertisement