గణాంకాలు, ఫెడ్‌ సమీక్షపై దృష్టి | Impact of the West Asia War on Crude Oil Prices | Sakshi
Sakshi News home page

గణాంకాలు, ఫెడ్‌ సమీక్షపై దృష్టి

Mar 16 2026 3:46 AM | Updated on Mar 16 2026 3:46 AM

Impact of the West Asia War on Crude Oil Prices

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం 

ముడిచమురు ధరలకూ ప్రాధాన్యత 

ద్రవ్యోల్బణం, ఉపాధి, ఐఐపీ కీలకం 

ఈ వారం సైతం మార్కెట్లకు సెగ

దేశ, విదేశీ గణాంకాలు, యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష తదితరాలు ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. అయితే ఇప్పటికే ప్రపంచ మార్కెట్లను బలహీనపరచిన పశ్చిమాసియా యుద్ధం సెంటిమెంటుకు కీలకంగా నిలవనుంది. ముడిచమురు ధరల పెరుగుదల ప్రధానంగా ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తోంది. వెరసి మరోసారి స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లను చవిచూడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

బ్రెంట్‌ చమురు బ్యారల్‌ లండన్‌ మార్కెట్లో గత వారం 102 డాలర్ల ఎగువకు చేరడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. ఇరాన్, యూఎస్, ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడం, హుర్ముజ్‌ మార్గంలో నౌకల రవాణాకు అంతరాయాలు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేయనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ప్రధానంగా చమురు, గ్యాస్‌ సరఫరాల కొరత భారత్‌ను వేధిస్తోంది. నేడు(16న) చమురు ధరలు మరోసారి మండితే ద్రవ్యోల్బణం మరింత పెరిగే వీలుంది.  

ఫెడ్‌ దారెటు? 
ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయాలను బుధవారం(18న) ప్రకటించనుంది. గత పాలసీ సమీక్షలో యథాతథ వడ్డీ రేట్ల అమలుకే కట్టుబడింది. దీంతో ఫెడ్‌ రేట్లు 3.5–3.75% వద్దే కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి, ప్రయివేట్‌ రంగ ఉపాధి,  చమురు నిల్వల గణాంకాలు సైతం ఈ వారం విడుదల కానున్నాయి. వీటికితోడు పశి్చమాసియా యుద్ధం, ధరల పెరుగుదల తదితర అంశాలను ఫెడ్‌ పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఆర్ధికవేత్తలు తెలియజేశారు. 

దేశీయంగా.. 
దేశీయంగా గత నెల రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 10 నెలల గరిష్టం 3.21 శాతాన్ని తాకింది. నేడు టోకు ధరల(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. జనవరిలో డబ్ల్యూపీఐ 1.81 శాతం పెరిగింది. ఫిబ్రవరి నెలకు వాణిజ్య గణాంకాలు సైతం విడులకానున్నాయి. కాగా.. బ్రెంట్‌ చమురు 101 డాలర్లకు చేరడంతో వాణిజ్య లోటు పెరగనుంది. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సైతం బలహీనపడుతోంది. యుద్ధం కొనసాగితే చమురు, గ్యాస్‌ కొరత పెరిగి ద్రవ్యోల్బణానికి రెక్కలు వచ్చే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.

సాంకేతికంగా చూస్తే ఈ వారం .. 
యుద్ధ భయాలు, చమురు ఆందోళనలు ఈ వారం సైతం మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. వీరి విశ్లేషణ ప్రకారం మార్కెట్లు మరింత బలహీనపడే అవకాశముంది. 
⇒  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22,800–22,600 పాయింట్లవరకూ నీరసించవచ్చు. ఇక్కడి నుంచి బలపడకుంటే 22,200–22,100 పాయింట్లవరకూ పతనంకావచ్చు. ఒకవేళ బలాన్ని పుంజుకుంటే 23,700–23,900 పాయింట్ల వద్ద అవరోధాలు ఎదురయ్యే వీలుంది. 24,000 పాయింట్లు దాటితే మరింత పుంజుకోవచ్చు.

గత వారం పతన బాటలో
పశ్చిమాసియా యుద్ధం, చమురు ధరలు, రూపాయి క్షీణత ప్రభావంతో గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నికరంగా సెన్సెక్స్‌ 4,355 పాయింట్లు(5.5 శాతం) పతనమై 74,564 వద్ద ముగిసింది. నిఫ్టీ 1,299 పాయింట్లు(5.3 శాతం) కోల్పోయి 23,151 వద్ద నిలిచింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 4 శాతం స్థాయిలో క్షీణించాయి. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుంచి చూస్తే సెన్సెక్స్‌ 6,723 పాయింట్లు(8.3 శాతం) పడిపోయింది. బీఎస్‌ఈ మార్కెట్‌ విలువ రూ. 34 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది.

ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఈ నెల ప్రారంభం నుంచీ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఫలితంగా మార్చి తొలి రెండు వారాల్లో నికరంగా రూ. 52,704 కోట్ల(5.73 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు ఫిబ్రవరిలో రూ. 22,615 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా గత 17 నెలల్లోనే అత్యధిక పెట్టుబడులు చేపట్టారు. అయితే చమురు ధరలు, యుద్ధ భయాలతో ఈ నెల నుంచీ అమ్మకాల యూటర్న్‌ తీసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement