బోధనేతర విభాగంలోని సివిల్ అసిస్టెంట్ సర్జన్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా బోధన విభాగానికి, ఈ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లను సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా బదిలీ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) కొట్టివేసింది.
సాక్షి, హైదరాబాద్: బోధనేతర విభాగంలోని సివిల్ అసిస్టెంట్ సర్జన్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా బోధన విభాగానికి, ఈ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లను సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా బదిలీ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) కొట్టివేసింది. డీఎంఈ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధమని సభ్యులు డి.కె.పన్వర్, శివయ్యనాయుడులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు వేర్వేరని స్పష్టం చేసింది. వివరాలిలా ఉన్నాయి... నాన్టీచింగ్ విభాగంలో పనిచేస్తున్న కొందరు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు తమను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా బదిలీ చేయాలంటూ డీఎంఈకి వినతిపత్రాలు సమర్పించారు.
వాటిని పరిశీలించిన డీఎంఈ... అసిస్టెంట్ సర్జన్లకు పోస్టు గ్రాడ్యుయేషన్ అర్హత ఉందంటూ వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉన్న వారిని సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాలు చేస్తూ తిరుపతిలోని స్విమ్స్ ఈఎన్టీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గౌరీపెద్ది శ్రీనివాస్ ఏపీఏటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాది డాక్టర్ కె.లక్ష్మీనర్సింహ వాదనలు వినిపిస్తూ, నిబంధనలను బేఖాతరు చేస్తూ డీఎంఈ ఏకపక్షంగా బదిలీ ఉత్తర్వులు జారీ చేశారని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం డీఎంఈ చర్యను తప్పుపట్టింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు శిక్షణ ఇవ్వాలనుకుంటే వారిని ప్రతీ సంవత్సరం టీచింగ్ విభాగంలో ఏర్పడే ఖాళీల్లో నియమించాలని ప్రభుత్వానికి సూచించింది.