సైనికుల్లా పనిచేస్తాం.. కార్యకర్తలకు అండగా ఉంటాం 

Deputy Chief Minister Narayana Swamy And Panchayati Raj Minister Peddi Reddy Ramachandra Reddy Said Ministers And MLAs Are Acting Like Soldiers To Solve Public Problems - Sakshi

మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి    

సాక్షి, చిత్తూరు అగ్రికల్చర్‌ : వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, వారి సమస్యల పరిష్కారానికి మంత్రులు, ఎమ్మెల్యేలు సైనికుల్లా పనిచేస్తామని డెప్యూటీ సీఎం, ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణ స్వామి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయ ఆవరణలో చిత్తూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కృషి చేయడం వల్లే వైఎస్సార్‌సీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేశారన్నారు. ప్రతి కార్యకర్త సంతోషంగా ఉండాలన్నదే ఆయన ధ్యేయమన్నారు. కార్యకర్తలు సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే అధికారుల ద్వారా సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం కార్యకర్తలు, నాయకులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. 

జిల్లా అభివృద్ధికి కృషి..
కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లా అభివృద్ధికి తమవంతు నిరంతరం కృషి చేస్తామని చిత్తూరు పార్లమెంటు సభ్యుడు రెడ్డెప్ప అన్నారు. జిల్లాలో ఎక్కడా గాని ఒక్క సెంట్రల్‌ స్కూల్‌ లేదన్నారు. చిత్తూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. చిత్తూరు రైల్వేస్టేషన్‌లో ప్రతి రైలు నిలిచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మేమున్నాం...
ప్రతి కార్యకర్తకు ఎల్లవేళలా వెన్నుదన్నుగా తామున్నామని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భరోసా ఇచ్చారు. పార్టీ అఖండ విజయానికి కృషి చేసిన కార్యకర్తలందరికి ఎల్లప్పుడు జవాబుదారీగా ఉంటామన్నారు. సమావేశంలో పలమనేరు, మదనపల్లె, సత్యవేడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వెంకటేగౌడ, నవాజ్‌బాషా, ఆదిమూలం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఈసీ మెంబరు పురుషోత్తంరెడ్డి, చిత్తూరు నగర కన్వీనర్‌ చంద్రశేఖర్, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, నాయకులు జేఎంసీ శివ, పోకల అశోక్, జగదీశ్, రఘునాథరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, త్యాగరాజులు, మధుసూదన్‌రాయల్, భాగ్యలక్ష్మి,  పూంగొడి, ప్రతిమారెడ్డి, రాజరత్నంరెడ్డి పాల్గొన్నారు. 

నల్లబెల్లంపై ఆంక్షలు ఎత్తివేయండి 
జిల్లాలోని చెరకు రైతులు తయారుచేసే నల్లబెల్లంపై ఆంక్షలు ఎత్తివేసి ఆదుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి,  పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను రైతు సంఘ నాయకులు, బెల్లం వ్యాపారులు కోరారు. గురువారం వారు స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో మంత్రులను కలిసి ఈ మేరకు వినతి చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జిల్లాకు విచ్చేసిన వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నల్లబెల్లంపై ఆంక్షలు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు వెంకటరెడ్డి, జయచంద్రచౌదరి, నాగిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, బెల్లం వ్యాపారులు కె.శ్రీధర్‌రెడ్డి, మాధవనాయుడు, కేడీసీ భాస్కర్, డీఎస్‌ రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, రెడ్డిప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. 


సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు  

ఉద్యోగ భద్రత కల్పించండి
ఉపాధి హామీ పథకం అమలుకు గత 13 ఏళ్లుగా కృషి చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉపాధి హామీ సిబ్బంది రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డిని కోరారు. గురువారం వారు తిరుపతిలో మంత్రిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. 2006 నుంచి ఉపాధి హామీ పథకం అమలుకు కాంట్రాక్టు పద్ధతిన వివిధ కేటగిరీల్లో విధులు నిర్వర్తిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీడీలు, ఏపీఓలు, ఈసీలు, టీఏలు, సీఓలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top