డీలర్లను వేధిస్తే ఆందోళనలు తప్పవు | Dealers | Sakshi
Sakshi News home page

డీలర్లను వేధిస్తే ఆందోళనలు తప్పవు

Apr 23 2015 2:08 AM | Updated on May 29 2018 4:15 PM

అధికారపార్టీ నేతలకు తలొగ్గి చౌక దుకాణం డీలర్లను వేధింపులకు గురిచేస్తే సహించబోమని, ఆందోళనలు చేపడతామని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి తెలిపారు.

 వైఎస్‌ఆర్‌సీపీ నేత ఎల్‌ఎం
 కళ్యాణదుర్గం : అధికారపార్టీ నేతలకు తలొగ్గి చౌక దుకాణం డీలర్లను వేధింపులకు గురిచేస్తే సహించబోమని, ఆందోళనలు చేపడతామని  వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి తెలిపారు. కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకున్న వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతి పరులైన   డీలర్లను తనిఖీల పేరుతో వేధించడం అన్యాయమన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఆర్డీవో రామారావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఎల్‌ఎం మాట్లాడుతూ అధికారపార్టీ నాయకులు చెప్పినట్లు అధికారులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు.
 
 ఇట్లంపల్లి  డీలర్ అనంతమ్మ చౌకడిపోను తొమ్మిదిసార్లు సీజ్ చేయడం ఏం న్యాయమని ప్రశ్నించారు. వేధింపులు తాళలేక డీలర్లు ఆత్మహత్యలకు పాల్పడితే అధికారులతో పాటు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.  పట్టణంలో రోడ్ల విస్తర్ణ విషయంలో అధికారులు, మునిసిపాలిటీ పాలక వర్గం చిత్త శుద్ధితో వ్యవహరించాలన్నారు.  రోడ్ల విస్తరణ విషయంలో అన్ని వర్గా వారితో సంప్రదించకపోతే శాంతి భద్రతల సమస్య  తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి భవన యజమానులతో కలిసి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని తీసుకొచ్చి రోడ్ల విస్తరణ చేపట్టాలన్నారు. ఎఫ్‌ఎంబీ పేరుతో సర్వేలు ఒక్కొచోట ఒక్కో రకంగా ఆక్రమణలను గుర్తించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు. వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. నియోజకవర్గంలో చెరువులను నింపే కార్యక్రమం పై ప్రజాప్రతినిధులు మాటలకే పరిమితమయ్యారన్నారు.  
 
 అనేక చెరువులు మరమ్మతులకు నోచుకోలేదని, వర్షపు నీరు మొత్తం వృథా అయ్యే పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో  మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ రఘునాథ్‌రెడ్డి, వైఎస్స్రాసీపీ మండల కన్వీనర్ దొణస్వామి, పట్టణ కన్వీనర్ జయరాం పూజారి,  నాయకులు కిరణ్‌చౌదరి, రోషన్, ఒంటిమిద్ది ఎర్రిస్వామి, హనుమంతరాయగౌడ్, బొమ్మయ్య, వెంకటేశులు, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement