చేపలు కోట్లను తింటున్నాయా!

Crores Corruptikon In Fish Farming PSR Nellore - Sakshi

చేప పిల్లల పంపిణీలో మతలబు

అధికార పార్టీ నేతల చేతివాటం

నెల్లూరు(సెంట్రల్‌): చేపల పెంపకం కోసం రూ.కోట్లు ఖర్చుపెడుతున్నామంటున్నారు. కాని ఈ కోట్లు ఎక్కడ ఖర్చుపెడుతున్నారో లెక్కల్లో మాత్రమే చూపుతున్నారు. ప్రధానంగా జిల్లాలోని జలాశయాల్లో ఉచిత చేపల పెంపకంపై నీలినీడలు అలముకున్నాయి. రాజకీయ నాయకుల రంగప్రవేశంతో మొత్తం పక్కదారి పడుతోంది. అర్హులైన వారికి ఉచితంగా చేపల పంపిణీ కార్యక్రమం అనుకున్న రీతిలో జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోటి చేప పిల్లలు పెంపకం ఎక్కడ జరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మొత్తం మత్స్యశాఖ ద్వారా చేస్తున్న చేపల పెంపకంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

లక్షల్లో ఎక్కడ వదిలారు
జిల్లాలోని సోమశిల, కండలేరులతో పాటు పలు జలాశయాల్లో ఉచితంగా రూ.2 కోట్లతో కోటి చేప పిల్లలను వదులుతామని అధికారులు, పాలకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 10 లక్షల చేపపిల్లలను వదిలామని, మరో 90 లక్షల పిల్లలను త్వరలోనే వదులుతామని పేర్కొంటున్నారు. కాని వేలల్లో వదిలేసి లక్షల్లో లెక్కలు చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి చేపపిల్లలను లెక్కించే పరిస్థితి లేక పోవడంతో ఎన్ని వదిలారో వాస్తవంగా తెలియడం లేదు. లెక్కల్లో మాత్రం లక్షల్లో వదిలినట్టు చూపిస్తున్నారు.

పంపిణీలోను మతలబు
జిల్లాలో 244 మత్స్యకార సొసైటీలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. సొసైటీలలోని వారికి ఉచితంగా చేపలను పంపిణీ చేయాల్సి ఉంది. కాని అది కూడా అర్హులకు కాకుండా కొందరు అధికార పార్టీ చెప్పిన వారికి ఇస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఉచితంగా ఇస్తామన్న చేపలు పలువురు అధికార పార్టీ నాయకులు చేపల చెరువుల్లో వదులుతున్నారనే ఆరోపణలు కూడా వినిపించక మానడం లేదు. దీంతో మత్స్యశాఖ ద్వారా పంపిణీ చేసే చేపలు పక్కదారి పడుతున్నట్టు తెలుస్తోంది.

అధికార పార్టీ నేతల చేతివాటం
కోటి పిల్లలను ఎక్కడ పంపిణీ చేసేది ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. జిల్లాలోని ఏడు జలాశయాల్లో పంపిణీ అంటున్నారు. కాని చేపపిల్లలు లెక్కించడం కుదరదుకాబట్టి వేలల్లో వదులుతూ లక్షల్లో చూపిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన పలువురు మత్స్యశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకుని వచ్చి, తమకు నచ్చిన ప్రాంతాల్లో, వారికి అనుకూలంగా ఉన్న జలాశయాల్లో వదిలేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా చేపపిల్లలను వదిలేయాల్సిది పోయి వదులుతామని చెప్పడంపైనా విమర్శలున్నాయి.  

కోటి టార్గెట్‌ను పూర్తి చేస్తాం
జిల్లాలోని పలు జలాశయాల్లో కోటి చేప పిల్లలను వదిలే విధగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే దాదాపుగా 10 లక్షలు వదిలేశాం. మిగిలిన వాటిని త్వరలోనే వదులుతాం. అర్హులైన వారికి మాత్రమే ఉచితంగా పంపిణీ చేస్తాం.           – శ్రీహరి, జేడీ మత్స్యశాఖ

అర్హులకు అందడం లేదు
ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసే విధానం ఎక్కడా అర్హులకు అందిన దాఖలాలు లేవు. అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికి అరకొర ఇచ్చేసి వెళ్తున్నారు. చేప పిల్లలు కావాలని ఎవరైనా అడిగితే అధికార పార్టీ నాయకుల సిఫారుసు కావాలని చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం. జలాశయాల్లో చేప పిల్లలను చెప్పిన ప్రకారం వదలాలి.–కొమారి శ్రీనివాస్, మత్స్యకారుడు, కావలి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top