ఉద్యోగుల డేటా రూపొందించాలి | Create employee data | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల డేటా రూపొందించాలి

Dec 20 2013 2:02 AM | Updated on Apr 6 2019 9:01 PM

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి సమగ్ర డేటాను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

=ద్యోగులు 24లోగా వివరాలు అందించాలి
 =నవరి 5 లోగా వెబ్‌సైట్‌లో పెట్టాలి
 =డియోకాన్ఫరెన్స్‌లో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ

 
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ప్రతి ఉద్యోగీ తమ పూర్తి వివరాలను నిర్ణీత పట్టికలో వారి కార్యాలయ డ్రాయింగ్, డిస్బర్స్‌మెంట్ అధికారులకు ఈ నెల 24లోగా తప్పక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీవీ రమేష్ బాబు ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి సమగ్ర డేటాను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రతి అధికారీ తమ కార్యాలయాల్లో పనిచేసే అన్ని తరగతుల ఉద్యోగుల పూర్తి సమాచారాన్ని సేకరించుకుని, వెబ్‌సైట్‌లో డేటా ఎంట్రీ జనవరి ఐదో తేదీ నాటికి పూర్తిచేయాలని చెప్పారు. సేకరించిన సమాచారాన్ని ధ్రువీకరించిన తర్వాతే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్ ఈ విషయంలో జిల్లా ఖజానాధికారులను పూర్తి బాధ్యతలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రెజరీ ద్వారా జీతాలు డ్రా చేసే అధికారులు, సిబ్బంది వారి డేటాను సమ్రగంగా సేకరించారో లేదో గమనించాలని చెప్పారు.
 
అలవెన్స్‌ల నుంచి ఆధారపడినవారి వివరాల వరకు...

ఉద్యోగులకు వర్తించే 49 రకాల అలవెన్సులు, జీతభత్యాల నుంచి మినహాయింపులు, వారిపై ఆధారపడుతున్న వారి వివరాలు కూడా సమగ్రంగా సేకరించాల్సి ఉందని రమేష్‌బాబు చెప్పారు. 1993 నవంబరు 25 నాటికి ఐదేళ్లు పూర్తి చేసిన  కంటింజెంట్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరించనున్నందున ఈ వివరాలు తప్పనిసరని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి, డ్వామా తదితర సంస్థలలో కమ్యూనిటీ బేస్‌పై పనిచేస్తున్న ఉద్యోగులకు వేరుగా ఉత్తర్వులు జారీచేస్తామని కలెక్టర్ రఘునందనరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
ట్రెజరీ జిల్లా అధికారులకు కలెక్టర్ ఆదేశాలు...

జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లిస్తున్న సిబ్బంది వివరాలు సేకరించడానికి తగిన శిక్షణ అందించాలని విజయవాడ డీటీవో ప్రసాదబాబును కలెక్టర్ రఘునందనరావు ఆదేశించారు. ప్రభుత్వం అన్ని కార్యాలయాలలో, అన్ని కేడర్‌లలో పనిచేసే వారి సమగ్ర వివరాలు సేకరిస్తున్నందున, బాధ్యతతో వ్యవహరించి జిల్లా డ్రాయింగ్ అధికారులకు తగిన సూచనలు ఇవ్వాలన్నారు. ఈ విషయంలో తగిన సూచనలను రూపొందించి సర్క్యులర్ రూపంలో పంపాలని, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ట్రెజరీ అధికారులకు సూచనలిచ్చారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ సీహెచ్ సరస్వతి కుమార్, డీసీపీ ఏఎస్ ఖాన్, జెడ్పీ సీఈఓ సుబ్బారావు, ఏటీవో ఎస్.రవికుమార్, ఎస్‌టీవో సి.వసంత తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement