సహకార సంఘాల సొమ్ముతో ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అలియాస్ కలవపూడి శివ తన సొంత ట్రస్ట్కు ప్రచారం కల్పించుకుంటున్నారు.
సహకార సంఘాల నిధులతో శివ ట్రస్ట్కు ప్రచారం
నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ఊ కొట్టిన అధికారులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :సహకార సంఘాల సొమ్ముతో ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అలియాస్ కలవపూడి శివ తన సొంత ట్రస్ట్కు ప్రచారం కల్పించుకుంటున్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పాలకోడేరు, ఉండి, కలవపూడి, పెదపుల్లేరు, ఆకివీడు, చెరుకుమిల్లి, కాళ్లకూరు, కాళ్ల, కోపల్లె సహకార సంఘాలకు చెందిన సీజీఎస్ (కామన్ గుడ్ ఫండ్)ను నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వినియోగించుకుంటున్నారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం పేరిట తన ట్రస్ట్ (శివ స్వచ్ఛంద సేవా సంస్థ) తరఫున మొక్కలకు ట్రీ గార్డులు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే భావించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ట్రీ గార్డుల ఏర్పాటుకయ్యే నిధులను మాత్రం ట్రస్ట్ నుంచి ఇవ్వకుండా ఆ ‘ఇండెంట్’ను సహకార సొసైటీలపై వేసేశారు. నియోజకవర్గ పరిధిలోని ఒక్కొక్క సొసైటీ నుంచి రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షల చొప్పున వసూలు చేశారు. సహకార సంఘాల నిబంధనల మేరకు కామన్ గుడ్ ఫండ్ను విద్య, వైద్యం, చారిటబుల్ ట్రస్ట్లకు మాత్రమే వినియోగించాల్సి ఉంది. ఎమ్మెల్యే ఆదేశాలకు తలొగ్గిన సొసైటీల అధ్యక్ష, కార్యదర్శులు స్వచ్ఛభారత్ పేరుతో మొక్కలకు ట్రీ గార్డుల నిమిత్తం విడుదల చేశారు. వాస్తవానికి సొసైటీల నుంచి వసూలు చేసిన సొమ్మును ఆ సొసైటీల పరిధిలోని గ్రామాల్లోనే ఖర్చు చేయాలి. ఒకవేళ వేరే గ్రామాల్లో వినియోగించాల్సి వస్తే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంది. కానీ ఇక్కడ అధికారులు, సొసైటీ బాధ్యులు తమ ఇష్టానుసారం సహకార సంఘాల నిధులను దారి తప్పించారు.
వాటికి పేరైనా దక్కలేదు
ఇక సహకార సంఘాల నుంచి వసూలు చేసిన లక్షలాది రూపాయల నిధులతో తయారు చేసిన ట్రీ గార్డులపై ఆయా సొసైటీలకు చెందిన పేర్లు పెట్టకుండా ఎమ్మెల్యేకి చెందిన శివ ట్రస్ట్ పేర్లు రాసి ప్రచారం చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై భీమవరం కో-ఆపరేటివ్ డెప్యూటీ రిజిస్ట్రార్ ఎన్.మురళీకృష్ణను ‘సాక్షి’ ప్రతినిధి వివరణ కోరగా.. సహకార సంఘాలు నిధులు విడుదల చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ‘ఎంతమేరకు నిధులు ఇచ్చారనేది నాకూ తెలియదు. ఎందుకు విడుదల చేశారని సొసైటీల బాధ్యులను ప్రశ్నిస్తే.. రైతులకు విత్తనాల పంపిణీ నిమిత్తం ఖర్చు చేశామని చెబుతున్నారు. దీనిపై విచారణ చేస్తున్నాం’ అని చెప్పారు.
రికవరీ చేస్తాం : డీసీవో లూథర్ సహకార సొసైటీల నిధులను
దుర్వినియోగం చేస్తే సహించేది లేదని జిల్లా సహకార అధికారి (డీసీవో) కె.లూథర్ హెచ్చరించారు. ఉండి నియోజకవర్గంలో సొసైటీల నిధులతో ట్రీ గార్డులు ఏర్పాటు చేయడం నిబంధనలకు
విరుద్ధమేనని స్పష్టం చేశారు. ఆ నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, ఆ నిధులను
సొసైటీ బాధ్యుల నుంచి రికవరీ చేస్తామని చెప్పారు.