Cooperative funds
-
సొమ్ము సొసైటీది.. సోకు ఎమ్మెల్యేది
సహకార సంఘాల నిధులతో శివ ట్రస్ట్కు ప్రచారం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ఊ కొట్టిన అధికారులు సాక్షి ప్రతినిధి, ఏలూరు :సహకార సంఘాల సొమ్ముతో ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అలియాస్ కలవపూడి శివ తన సొంత ట్రస్ట్కు ప్రచారం కల్పించుకుంటున్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పాలకోడేరు, ఉండి, కలవపూడి, పెదపుల్లేరు, ఆకివీడు, చెరుకుమిల్లి, కాళ్లకూరు, కాళ్ల, కోపల్లె సహకార సంఘాలకు చెందిన సీజీఎస్ (కామన్ గుడ్ ఫండ్)ను నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వినియోగించుకుంటున్నారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం పేరిట తన ట్రస్ట్ (శివ స్వచ్ఛంద సేవా సంస్థ) తరఫున మొక్కలకు ట్రీ గార్డులు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే భావించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ట్రీ గార్డుల ఏర్పాటుకయ్యే నిధులను మాత్రం ట్రస్ట్ నుంచి ఇవ్వకుండా ఆ ‘ఇండెంట్’ను సహకార సొసైటీలపై వేసేశారు. నియోజకవర్గ పరిధిలోని ఒక్కొక్క సొసైటీ నుంచి రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షల చొప్పున వసూలు చేశారు. సహకార సంఘాల నిబంధనల మేరకు కామన్ గుడ్ ఫండ్ను విద్య, వైద్యం, చారిటబుల్ ట్రస్ట్లకు మాత్రమే వినియోగించాల్సి ఉంది. ఎమ్మెల్యే ఆదేశాలకు తలొగ్గిన సొసైటీల అధ్యక్ష, కార్యదర్శులు స్వచ్ఛభారత్ పేరుతో మొక్కలకు ట్రీ గార్డుల నిమిత్తం విడుదల చేశారు. వాస్తవానికి సొసైటీల నుంచి వసూలు చేసిన సొమ్మును ఆ సొసైటీల పరిధిలోని గ్రామాల్లోనే ఖర్చు చేయాలి. ఒకవేళ వేరే గ్రామాల్లో వినియోగించాల్సి వస్తే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంది. కానీ ఇక్కడ అధికారులు, సొసైటీ బాధ్యులు తమ ఇష్టానుసారం సహకార సంఘాల నిధులను దారి తప్పించారు. వాటికి పేరైనా దక్కలేదు ఇక సహకార సంఘాల నుంచి వసూలు చేసిన లక్షలాది రూపాయల నిధులతో తయారు చేసిన ట్రీ గార్డులపై ఆయా సొసైటీలకు చెందిన పేర్లు పెట్టకుండా ఎమ్మెల్యేకి చెందిన శివ ట్రస్ట్ పేర్లు రాసి ప్రచారం చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై భీమవరం కో-ఆపరేటివ్ డెప్యూటీ రిజిస్ట్రార్ ఎన్.మురళీకృష్ణను ‘సాక్షి’ ప్రతినిధి వివరణ కోరగా.. సహకార సంఘాలు నిధులు విడుదల చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ‘ఎంతమేరకు నిధులు ఇచ్చారనేది నాకూ తెలియదు. ఎందుకు విడుదల చేశారని సొసైటీల బాధ్యులను ప్రశ్నిస్తే.. రైతులకు విత్తనాల పంపిణీ నిమిత్తం ఖర్చు చేశామని చెబుతున్నారు. దీనిపై విచారణ చేస్తున్నాం’ అని చెప్పారు. రికవరీ చేస్తాం : డీసీవో లూథర్ సహకార సొసైటీల నిధులను దుర్వినియోగం చేస్తే సహించేది లేదని జిల్లా సహకార అధికారి (డీసీవో) కె.లూథర్ హెచ్చరించారు. ఉండి నియోజకవర్గంలో సొసైటీల నిధులతో ట్రీ గార్డులు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమేనని స్పష్టం చేశారు. ఆ నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, ఆ నిధులను సొసైటీ బాధ్యుల నుంచి రికవరీ చేస్తామని చెప్పారు. -
అవినీతి కార్యదర్శులను ఏరిపారేస్తాం
►సహకార సంఘాలలో అవకతవకలను సహించం ►స్వాహా నిధులు వసూలు చేస్తాం ►రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం ►జీడీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు ►ముమ్మనేని వెంకట సుబ్బయ్య కొత్తపేట(గుంటూరు): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఎటువంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని జీడీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు ముమ్మనేని వెంకట సుబ్బయ్య హెచ్చరించారు. అవినీతి పాల్పడుతున్న కార్యదర్శులను ఏరిపారేస్తామని చెప్పారు. బుధవారం స్థానిక బ్రాడీపేట 2వలైన్లోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జరిగిన మహాజన సభ సమావేశంలో ఆయన సహకార సంఘ బ్యాంకులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమానికి జిల్లాలోని 167 సహకార సంఘాల చైర్మన్లు, 17 మంది బోర్డు డెరైక్టర్లు హాజరయ్యారు. సమావేశంలో 104 వ వార్షిక బడ్జెట్ నివేదికలను ప్రవేశపెట్టారు. సహకార సంఘాల నిధుల స్వాహా విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మంగళగిరిలో రూ.50లక్షలు, దుగ్గిరాలలో రూ.50 లక్షలు, నరసరావుపేటలో రూ.20 లక్షలు, తాడేపల్లిలో కోటీ 6 లక్షలను కార్యదర్శులు గోల్మాల్ చేశారని చెప్పారు. వారిని విధుల నుంచి తొలగించామని వెల్లడించారు. కొంత మేరకు రికవరీ చేశామని తాడేపల్లిలో మాత్రం రికవరీలో జాప్యం జరుగుతోందని, త్వరలో వసూలు చేస్తామన్నారు. రైతుల సంక్షేమానికి సహకార సంఘం పెద్దపీట వేస్తూ వస్తోందని చెప్పారు. 2008లో కాగ్ నివేదికను అనుసరించి రుణాల మాఫీలో అవకతవకలకు పాల్పడిన కార్యదర్శులను, అధ్యక్షులను, రైతులను గుర్తించి రికవరీ చేస్తామన్నారు. ప్రభుత్వ రుణమాఫీ ప్రకటనతో బ్యాంక్ తరఫున గత ఏడాది డిసెంబర్ 31 వరకు సుమారు కోటీ 40 లక్షల మంది లబ్ధిదారులకు రూ.740 కోట్లు వ్యవసాయ, బంగారు నగ లు, చేనేత, డ్వాక్రా రుణాలు మాఫీ జరగాలన్నారు. ఈ ఏడాది జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలల్లో రైతులు చెల్లించిన రుణాల మాఫీకి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ గత ఏడాది డిసెంబర్ 31 వరకు తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తుందని ప్రకటన చేసిందని, ఈ క్రమంలో జిల్లాలో 20 వేల మంది లబ్ధిదారులు రూ.300 కోట్ల రుణాలు చెల్లించారని, చెల్లించిన రైతులు రుణాలను రీషెడ్యూల్ చేస్తామని తెలిపారు. విత్తనాలు, పురుగుమందులు అందిస్తాం.. : అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందు రోజులలో రైతుల మేలు ఆశించి విత్తనాలు, పురుగుమందులు అందిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు రైతులకు ఎరువులు అందించామని, దీనితోపాటు రైతు సంక్షేమానికి అవసరమైన ప్రతి వాటిని సరఫరా చేసేందుకు బ్యాంకు ముందుకు వస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది రైతులకు పంట నిల్వలపై ప్రత్యేక రుణాలు అందించేందుకు సన్నద్ధం అవుతున్నట్టు వివారించారు. గత పాలమండలిలో చేసిన తప్పలను తాము చేయబోమన్నారు.