డామిట్ కథ అడ్డం తిరిగింది..! | controversial turned to distribute house places | Sakshi
Sakshi News home page

డామిట్ కథ అడ్డం తిరిగింది..!

Jan 4 2014 2:06 AM | Updated on Sep 2 2017 2:15 AM

తన అనుయాయులకు ఇళ్ల స్థలాలు కట్టబెట్టడం ద్వారా లబ్ధిపొందాలని ఆశించిన ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

నంద్యాల, న్యూస్‌లైన్: తన అనుయాయులకు ఇళ్ల స్థలాలు కట్టబెట్టడం ద్వారా లబ్ధిపొందాలని ఆశించిన ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వచ్చింది. స్థానికులను కాదని ఇతర ప్రాంతాలవారికి ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారంటూ శుక్రవారం ఊడుమాల్పురం గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్థల పరిశీలనకు వచ్చిన లబ్ధిదారులను అడ్డుకున్నారు. నంద్యాల మండలం ఊడుమాల్పురం గ్రామ శివార్లలోని 530, 532 సర్వే నంబర్లలో ఆరున్నర ఎకరా స్థలాన్ని 250మందికి దశల వారీగా ఇళ్ల స్థలాలుగా ఇచ్చారు. చివరి దశలో భాగంగా ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి  గురువారం తన నివాసంలో 150మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. వీరు కోవెలకుంట్ల, సంజామల ప్రాంతాలకు చెందిన వారు కావడంతో ఊడుమాల్పురం గ్రామస్తులు ఆగ్రహించారు.

ఊడుమాల్పురం గ్రామ శివార్లలోని  స్థలాలను పరిశీలించడానికి వచ్చిన లబ్ధిదారులు అడ్డగించి తమ గ్రామ స్థలంలోకి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డిసైతం ఇక్కడికి రానీయబోమన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎమ్మెల్యే అనుయాయులు ఖంగు తినాల్సి వచ్చింది. ఆశించింది ఒకటయితే.. మరొకటి జరగడంతో ఎమ్మెల్యే శిల్పాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ సందర్భంగా గ్రామస్తుడు పుల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రాణాలైనా అర్పిచైనా స్థలాన్ని కాపాడుకుంటామని చెప్పారు.

‘‘ ఎన్నికల కోసం ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి ఈ డ్రామా ఆడుతున్నారు. గ్రామంలో పేదలకు ఇచ్చిన తర్వాత మిగిలితే ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందు కోసం రాజకీయ నాయకులతో కలిసి పోరాటాన్ని నిర్వహిస్తాం.’’ అని మాజీ ఎంపీపీ తిరుమలేష్ తెలిపారు. గ్రామంలో పేదల కడుపు కొట్టి నంద్యాల పట్టణంలోని వారికి స్థలాలు ఇస్తే చూస్తూ ఊరుకోబోమని గ్రామానికి చెందిన రాజగోపాల్‌రెడ్డి, మణిమోహన్‌రెడ్డి హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement