అందరూ సెలవులు పెడితే ఎలా?

Collector Nivas Fired On Medical Officer About Staff Taking Leaves In Veeraghattam PHC - Sakshi

సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం) : ఆసుపత్రి పనివేళల్లో కనీసం 20 శాతం సిబ్బంది అయినా అందుబాటులో ఉండకపోతే ఎలా? రోగుల పరిస్థితి ఏంటని కలెక్టర్‌ జే నివాస్‌ వైద్యాధికారి ప్రదీప్‌కుమార్‌పై అసహనం వ్యక్తం చేశారు. గురువారం వీరఘట్టం పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్‌ ఇక్కడ సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాజరు పట్టికను పరిశీలించారు. తక్కువ మంది సిబ్బందిలో కొంద రు బదిలీల కౌన్సెలింగ్‌కు, ఇంకొంత మంది సెలవుపై వెళ్లారు. అయితే ఆసుపత్రిలో కనీస సిబ్బంది కూడా లేకపోవడంతో ఆసుపత్రి నిర్వహణ బాగులేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.

హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వై యోగీశ్వరరరెడ్డి నాలుగు నెలల్లో 27 సెలవులు పెట్టినట్లు గుర్తించిన కలెక్టర్‌ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఉద్యోగికి ఇన్ని సెలవులు ఎలా మంజూరు చేశారని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే హెల్త్‌ ఎడ్యుకేటర్‌ను సస్పెండ్‌ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిని ఫోన్‌లో ఆదేశించారు. అంతకు ముం దు వార్డుల్లో రోగులను పలకరించి ఇక్కడ వైద్య చికిత్సల గురించి తెలుసుకున్నారు. అందరూ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. ఈయన వెంట పాలకొండ ఆర్డీవో ఎల్‌ రఘుబాబు, మండల ప్రత్యేకాధికారి ఎస్‌ శ్రీనివాసరావు ఉన్నారు.

ప్రభుత్వ సంస్థల్లో  వసతులు మెరుగుపడాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో మౌలిక వసతులు మెరుగుపడాలని కలెక్టర్‌ జే నివాస్‌ ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు విధిగా ఆస్పత్రులు, విద్యాసంస్థలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, తదితర సంస్థలను సందర్శించాలన్నారు. అక్కడ మౌలిక వసతుల కొరతను గుర్తించి వారంలోగా పరిష్కరించాలన్నారు. గురువారం సాయంత్రం మండల ప్రత్యేకాధికారులతో, మండల అధికారులతో కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి వీడి యో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రభుత్వ సంస్థలు మంచి సేవలకు నిలయాలుగా మారాలన్నారు.

ఆస్పత్రి ప్రసవాలు, వైద్యసేవలు పక్కాగా అం దాలని, వసతి గృహాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని ఆదేశించారు. మరుగుదొడ్లు, తదితర మరమ్మతులు తక్షణమే చేపట్టాలన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై, సిబ్బందిపై చర్యలు చేపట్టాలన్నారు. స్పందన కార్యక్రమానికి రావడం వల్ల సమస్య పరిష్కరమైనట్లుగా ప్రజల్లో నమ్మకం కలగాలన్నారు. మండల వ్యవస్థపై విశ్వాసం పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top