నేవీ డే ఉత్సవాల్లో పాల్గొన్న'సీఎం వైఎస్‌ జగన్‌' | YS Jagan Participated in Navy Day Celebrations at Visakhapatnam - Sakshi
Sakshi News home page

నేవీ డే ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌

Dec 4 2019 4:39 PM | Updated on Dec 5 2019 11:15 AM

CM YS Jagan Participated Navy Day Celebrations In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : భారత నావికా దళ దినోత్సవ వేడుకలు విశాఖపట్నంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. నౌకదళ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖలోని ఆర్కే బీచ్‌లో నేవీ విన్యాసాలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తిలకించారు.

1971లో పాకిస్తాన్‌పై యుద్దంలో గెలుపు సాధించడానికి తూర్పు నావికా దళం కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్‌పై గెలుపుకు ప్రతీకగా ఏటా డిసెంబర్‌ 4న నేవీ డే ను నిర్వహిస్తారు. తూర్పు నావికా దళం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా  విశాఖ ఆర్‌కే బీచ్‌లో నేవీ డే ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని నేవీ విన్యాసాలను తిలకించి  నేవీ సిబ్బందిని అభినందించారు.

సీఎం జగన్‌.. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు నేవీ విన్యాసాలను తిలకించారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి సర్క్యూట్‌ హౌస్‌కు చేరుకొని.. నేవీ హౌస్‌కు బయలుదేరి వెళ్లారు. నేవిహౌస్‌లో జరిగిన ఎట్‌ హోం  కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తోపాటు మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు  గుడివాడ అమర్‌నాథ్‌, చెట్టి ఫాల్గుణ, బాబురావు, వైజాగ్‌ సిటీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్‌ విమానంలో విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి 8.40గంటలకు తాడేపల్లిలోని తన నివాసం సీఎం చేరుకోనున్నారు. కాగా, నేవీ సర్క్యూట్ హౌస్‌లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీయుడబ్ల్యూజే చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు కలిశారు. జీవో 144 సవరించి ఉగాది నాటికి జర్నలిస్ లకు ఇల్లు, ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సీఎం జగన్‌ను కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement