మాటా కరువే! | CM left behind by a tour of discontent | Sakshi
Sakshi News home page

మాటా కరువే!

Sep 29 2013 3:30 AM | Updated on Jul 29 2019 5:28 PM

తిరుపతి విమానాశ్రయంలో శనివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలుసుకునేందుకు సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు పడరాని పాట్లు పడాల్సి వ చ్చింది.

సాక్షి, తిరుపతి: తిరుపతి విమానాశ్రయంలో శనివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలుసుకునేందుకు సమైక్యాంధ్ర జేఏసీ  నాయకులు పడరాని పాట్లు పడాల్సి వ చ్చింది. జేఏసీకి నాయకత్వం వహిస్తున్న ఆర్డీవో రామచంద్రారెడ్డి విమానాశ్రయం లోపలకు వెళ్లి కొంత సేపు మాట్లాడాలని కోరినా సీఎం స్పందించలేదని తెలిసిం ది. కడపజిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి కర్మక్రియలకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.

అక్కడ నుంచి హెలికాప్టర్‌లో తన స్వగ్రామం పీలేరు నియోజకవర్గం లోని నగిరిపల్లెకు చేరుకునేముందు, విమానాశ్రయంలో మధ్యాహ్న భోజనం చేసేందుకు గంటపాటు ఆగారు. ఈ సమయంలో ఆయన అధికారులతో, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి శుక్రవారం రాత్రి తనకు తానుగా సమైక్యవాదినని ప్రకటించుకున్న విషయం తెల్సిందే. దీంతో ఆయన్ను అభినందించడం తోపాటు, ఆయనతో కొంతసేపు మాట్లాడాలని సమైక్య జేఏసీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. వీరిలో ఎన్జీవో సంఘం  నాయకులూ ఉన్నారు. అరుుతే సీఎం వారితో మాట్లాడేందుకు అంగీ కరించలేదు.

ఒక దశలో జేఏసీ నాయకులు లోపలికి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పలుసార్లు ఆర్డీవో, ఎస్పీ రాజశేఖర్ బాబును జేఏసీ నాయకులు అభ్యర్థించగా, పది మంది నాయకులకు సీఎంను కలుసుకునే అవకాశం ఇప్పించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి విమానాశ్రయం వెలుపలకు వచ్చారు. సమైక్య జేఏసీ నాయకుల వైపు చూస్తూ చేయి ఊపి వెళ్లిపోయారు. మంచి సందేశం ఇస్తారన్న జేఏసీ నాయకులకు నిరాశే ఎదురు కావడంతో వెనుదిరిగారు. అనంతరం ముఖ్యమంత్రిని కలసిన నాయకులు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ జేఏసీ  చైర్మన్, ఆర్డీవో రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నందుకు సీఎంకు అభినందనలు చెప్పినట్టు తెలిపారు.

తాము చేస్తున్న కార్యక్రమాలను వివరించే ప్రయత్నం చేశామని దీనికి ‘అవునా’! అని అన్నారని తెలిపారు. జేఏసీ నాయకుడు  నరసింహయాదవ్ మాట్లాడుతూ సీఎం నిర్ణయాన్ని అభినందించామని, ఆయనకు తమ సహకారం అందజేస్తామని అన్నారు. రాష్ట్ర ఉద్యోగులు రెండు నెలలుగా చేస్తున్న ఉద్యమంపై ఆయన ప్రోత్సాహకరంగా మాట్లాడినట్లు తెలిపారు.  టీచర్స్ జేఏసీ నాయకుడు ప్రభాకర్ మాట్లాడుతూ  ఆరు కోట్ల మంది సీమాంధ్రులకు స్ఫూర్తి కలిగించేలా ప్రకటన చేశారని, ఈమేరకు అభినందనలు తెలిపామని చెప్పారు. జేఏసీ నాయకుల్లో శ్రీకాంత్‌రెడ్డి, మంజునాథ్, తాళ్లపాకసురేష్, కోటేశ్వరరావు, శేషారెడ్డి, డిగ్రీ కళాశాలల జేఏసీ నాయకుడు రామచంద్రారెడ్డి, విజయలక్ష్మి, సుశీల తదితరులు కూడా ముఖ్యమంత్రిని కలసిన వారిలో ఉన్నారు.

 సీకే.బాబుకు అభినందన

 సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్న  చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబును ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. విమానాశ్రయంలో మంత్రి అరుణకుమారి, సీకేబాబు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సీకే బాబులాగా  మిగిలిన నాయకులూ  ఉద్యమం చేపట్టాలని కోరారు. సీకే బాబు మాట్లాడుతూ సమైక్యవాదిగా ప్రకటించిన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపామన్నారు.

మంత్రి గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ శుక్రవారం నాటి ముఖ్యమంత్రి ప్రసంగం సమైక్యవాదుల్లో ఉత్తేజం కలిగించిందని కొనియాడారు. ఈ విషయాన్ని ఆయనకు చెప్పినట్లు ఆమె వెల్లడించారు. ఇంకా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కుతూహలమ్మ, పూతలపట్టు రవి, ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి, మాజీ మంత్రి చెంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, మంత్రి అరుణకుమారి, గల్లా జయదేవ్, నవీన్‌కుమార్‌రెడ్డి, కోలా ఆనంద్, గుండ్లూరు వెంకటరమణ, పులుగోరు మురళి తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement