స్పెషల్ బ్రాంచ్కు 'ఆ ఇద్దరు' | CI, SI transfer to special branch in anantapur district | Sakshi
Sakshi News home page

స్పెషల్ బ్రాంచ్కు 'ఆ ఇద్దరు'

May 12 2015 12:23 PM | Updated on Sep 2 2018 3:51 PM

స్పెషల్ బ్రాంచ్కు 'ఆ ఇద్దరు' - Sakshi

స్పెషల్ బ్రాంచ్కు 'ఆ ఇద్దరు'

అనంతపురం జిల్లా ఇటుకపల్లి సీఐ శ్రీనివాసులు, రాప్తాడు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌ను స్పెషల్‌ బ్రాంచ్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది

అనంతపురం : అనంతపురం జిల్లా ఇటుకపల్లి సీఐ శ్రీనివాసులు, రాప్తాడు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌ను స్పెషల్‌బ్రాంచ్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.  గత నెల 29న రాప్తాడు మండల వైఎస్సార్‌సీపీ నాయకుడు భూమిరెడ్డి శివప్రసాద్‌రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. స్వయానా పోలీస్‌స్టేషన్ పక్కన, తహశీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం వెనుక స్థానిక పోలీసులు నిఘా వైఫల్యమైందని భావించిన ఉన్నతాధికారులు సీఐ, ఎస్‌ఐను వీఆర్‌కు పంపుతూ చర్యలు తీసుకున్నారు.

అయితే నాటి నుంచి వారిని రిలీవ్‌ చేయకుండా అలాగే కొనసాగించారు. వారిని వీఆర్‌కు పంపడాన్ని మంత్రి సునీత సీరియస్‌గా పరిగణించి... రాష్ట్ర హోంశాఖ మంత్రితో చర్చించి అధికారులపై ఒత్తిడి చేయించారనే అరోపణలు వెల్లువెత్తాయి.  అంతేకాకుండా వారిని వీఆర్కు పంపడాన్ని నిరసిస్తూ మంత్రి సునీత తన గన్మెన్లు, భద్రత సిబ్బందిని వెనక్కు పంపడంతో పోలీసు ఉన్నతాధికారులు సందేహంలో పడ్డారు.

కాగా అనంతపురం డీఐజీ బాలకృష్ణ ఇటీవల మాట్లాడుతూ సీఐ, ఎస్‌ఐ ఇద్దర్నీ వీఆర్‌కు పంపామని అయితే శివప్రసాద్‌రెడ్డి హత్యకేసులో నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉన్నందున తాత్కాలికంగా వారిని కొనసాగిస్తున్నామన్నారు. అంతేకాకుండా నిందితులు అరెస్ట్ కాగానే వారిని వీఆర్‌కు పంపుతామని ప్రకటించారు. వారిద్దరని వీఆర్‌కు కాకుండా స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేయడం వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిడేనన్న ప్రచారం జరుగుతుంది. కాగా ఇటుకులపల్లి సీఐగా ప్రస్తుతం పెనుకొండ సీఐగా పని చేస్తున్న రాజేంద్రనాథ్‌యాదవ్‌ను, రాప్తాడు ఎస్‌ఐగా జీటీ నాయుడును జిల్లా ఎస్పీ నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement