నేడు సీఎం చంద్రబాబు రాక | Sakshi
Sakshi News home page

నేడు సీఎం చంద్రబాబు రాక

Published Thu, Jun 18 2015 1:21 AM

నేడు సీఎం చంద్రబాబు రాక - Sakshi

 పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్
 ప్రాంతాల్లో పర్యటన
 అనూహ్య పర్యటన
 వెనుక ఆంతర్యమేంటో!
 ఓటుకు నోటు వివాదం నుంచి దృష్టి మళ్లించడానికే అంటున్న విపక్షాలు

 
 ఏలూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు గురువారం జిల్లా పర్యటనకు రానున్నారు. పోలవరం ప్రాజెక్ట్, పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనుల తీరును పరిశీలించేందుకు సీఎం జిల్లాకు వస్తున్నట్టు అధికార వర్గాల భోగట్టా. గురువారం ఉదయం 10 గంటలకు చంద్రబాబు జిల్లాకు చేరుకుంటారు. రెండు వారాలుగా ఓటుకు నోటు వివాదంలో పీకలోతు కూరుకుపోయిన చంద్రబాబు అనూహ్యంగా గురువారం జిల్లాకు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. నే డో, రేపో ఏసీబీ నుంచి నోటీసులు అందుతాయని.. అరెస్ట్ అయ్యే అవకాశాలూ ఉన్నాయనే వాదనల నేపథ్యంలో సీఎం పర్యటనకు రానుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. నెలరోజుల క్రితమే చంద్రబాబు పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను పరిశీ లించి.. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో బస చేశారు.
 
  పనులు వేగవంతం చేయాలని ఆదేశిం చారు. సుదీర్ఘ సమీక్షలు చేశారు. అయినా ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అత్యవసరంగా పర్యటించాల్సిన అవసరం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. రెండు వారాలుగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఓటుకు నోటు వివాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే వస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పట్టిసీమ కాంట్రాక్ట్‌లో మిగిలిన అవినీతి సొమ్ముతోనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారని విపక్షాలు ఆరోపించగా, ఇదే సమయంలో సీఎం అదే పట్టిసీమకు రావడం చర్చనీయాంశమైంది.
 

Advertisement
Advertisement