రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడి కుట్రపూరిత పాలన సాగుతోందని, దీనిపై ప్రజలను చైతన్య పరిచి తిప్పికొట్టేలా చూడాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఎచ్చెర్ల :రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడి కుట్రపూరిత పాలన సాగుతోందని, దీనిపై ప్రజలను చైతన్య పరిచి తిప్పికొట్టేలా చూడాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పవర్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలంలోని తోటపాలెం కూడలి సమీపంలోని తన్మయి ఫంక్షన్హాల్లో శనివారం నిర్వహించిన మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాబు కుట్రపాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రైతులు, డ్వాకా సం ఘాల రుణ మాఫీతో అధికారంలోకి వచ్చిన బాబు హామీని నిలబెట్టుకోలేదన్నారు. ఇంటికో ఉద్యోగం తదితర హామీలను గాలికొదిలేశారని ఆరోపించారు. విదేశాలు తిరిగేందుకే బాబుకు సమయం చాలటం లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అణువిద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకం అని చెప్పిన టీడీపీ ప్రస్తుతం చాప కింద నీరులా ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తోందన్నారు.
బాబు తన హామీలను నిలబెట్టుకునేవరకూ పార్టీ తరఫున పోరాడుతామని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు అప్పట్లో పథకాలు అందిస్తే ప్రస్తుత రాజకీయ జోక్యానికి పథకాల అమల్లో ప్రాధాన్యం ఇస్తోందని సీతారాం ఆరోపించారు. అలాగే వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. వచ్చేనెల ఐదో తేదీన పార్టీ చేపట్టే మహాధర్నా విజయవంతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన 28 వేల మంది పింఛన్లను ప్రభుత్వం అక్రమంగా తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న 2019 ఎన్నిక ల్లో టీడీపీ కొట్టుకుపోవటం ఖాయమని అన్నారు. హుద్హుద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు, పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయ రక్త గొర్లె కిరణ్కుమార్, మాజీ ఎంపీపీ జనార్దనరెడ్డి, జెడ్పీ మాజీ విప్ సనపల నారాయణరావు, పార్టీ అధ్యక్షు డు మాడుగుల మురళీధర్ బాబా తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. పార్టీ అభివృద్ధికి పాటు పడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు నక్కా కృష్ణమూర్తి, జురుగుళ్ల శంకరరావు, నేతింటి నీలమప్పడు, జీరు అయ్యప్ప రెడ్డి, అంబటి శ్రీనివాసరావు, సనపల సూరిబాబు, పైడి భాస్కరరావు, పైడి త్రిమూర్తులు, కళ్లేపల్లి తిరుపతి రావు, బాడాన జనార్దన, అంబటి సుజాత, సనపల ఇందిర, బాషా శ్రీనివాసరావు, డొంక పోలయ్య, డొంక అప్పలరాజు, సువ్వారి రవికుమార్, నూక పాపారావు తదితరులు
పాల్గొన్నారు.