ఢిల్లీ సేఠ్‌ల కొను‘గోల్‌మాల్’ | Buy Seth in 'Golmaal' | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సేఠ్‌ల కొను‘గోల్‌మాల్’

May 16 2014 1:50 AM | Updated on Oct 9 2018 4:55 PM

నున్న మామిడి మార్కెట్‌లో ‘సూట్’ వివాద ం తలెత్తింది. ఢిల్లీసేఠ్‌ల అడ్డగోలు దోపిడీపై రైతులు తిరగబడ్డారు. తాము చెప్పినట్లు వినకుంటే సరకు కొనుగోలు చేయబోమంటూ సేఠ్‌లు హెచ్చరికలు జారీ చేశారు.

  •    నున్న మ్యాంగో మార్కెట్‌లో తలెత్తిన వివాదం
  •   సూట్ పద్ధతిపై తిరగబడిన రైతన్నలు
  •   కొనుగోళ్లు నిలిపేస్తామంటున్న సేఠ్‌లు
  •   కొనసాగుతున్న చర్చలు
  •  నున్న మామిడి మార్కెట్‌లో ‘సూట్’ వివాద ం తలెత్తింది. ఢిల్లీసేఠ్‌ల అడ్డగోలు దోపిడీపై రైతులు తిరగబడ్డారు. తాము చెప్పినట్లు వినకుంటే సరకు కొనుగోలు చేయబోమంటూ సేఠ్‌లు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రైతులు, సేఠ్‌లు వేర్వేరుగా సమావేశమై వ్యూహరచనలు చేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో ఉత్కంఠత నెలకొంది. చర్చలు సఫలం కాకుంటే శుక్రవారం నుంచి మార్కెట్ స్తంభించే పరిస్థితి నెలకొంది.
     
    పశ్చిమకృష్ణా, న్యూస్‌లైన్ : ఢిల్లీసేఠ్‌ల దోపిడీపై మామిడి రైతులు తిరగబడ్డారు. సూట్ (డిస్కౌంట్) పేరుతో చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట వేయకుంటే నున్న మామిడి మార్కెట్‌కు తాళాలు వేసి ఆందోళనకు దిగుతామని రైతులు స్పష్టంచేశారు. సూట్ లేకుంటే సరుకు కొనుగోలు చేయబోమని సేఠ్‌లు తెగేసి చెబుతున్నారు. ఈ సూట్ వివాదంపై గురువారం రాత్రి ఇరువర్గాలు వేర్వేరుగా సమావేశమై చర్చలు సాగించారు.

    ఈ చర్చలు ఫలితం ఇవ్వని పక్షంలో శుక్రవారం నుంచి మార్కెట్‌ను స్తంభింపజేందుకు రంగం సిద్ధమవుతోంది. మామిడి కాయ కోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో తలెత్తిన ఈ వివాదం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే నున్న మార్కెట్‌ను మామిడి ముంచెత్తింది.

     రోజుకు 50 నుంచి 70 లారీల సరకు ఉత్పత్తి అవుతోంది. ఈ క్రమంలో వివాదాన్ని సర్దుబాటు చేసేందుకు మార్కెట్ కమిటీ సభ్యులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. సరకుతో మార్కెట్ నిండిపోయింది కాబట్టి రెండు మూడు రోజులు కాయకోతల్ని నిలపాలని రైతులకు వర్తమానం పంపారు.

    రైతులు నిలువుదోపిడీ
     
    మామిడి రైతులు ఏటా నిలువు దోపిడీకి గురవుతున్నారు.  నున్న మ్యాంగో మార్కెట్‌లో ఏడాదికి రూ.150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వ్యాపారం జరుగుతోంది. టన్నుకు 80 కేజీల చొప్పున సూట్ పేరుతో కోతపెడుతున్నారు. దీనివల్ల రైతులు రూ.15 కోట్ల నష్టపోతున్నారు. దానిమ్మ, కిస్‌మిస్, యాపిల్ సరకు ఉత్పత్తుల కొనుగోళ్లలో సూట్ విధానం అమల్లో లేదు. హైదరాబాద్, చెన్నై మ్యాంగో మార్కెట్లలోనూ సూట్ తీయకుండానే వ్యాపారులు కొనుగోళ్లు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు.

    ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన బడా వ్యాపారులు జిల్లాలో మామిడి మార్కెట్‌ను శాసిస్తున్నారు. సిండి‘కేట్లు’గామారి ధర నిర్ణయిస్తున్నారు. సీజన్ ప్రారంభంలో రూ.30 వేలు పలికిన బంగినపల్లి ధర నేడు రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పడిపోయింది. మామిడి కాయల కోతలు ముమ్మరంగా సాగే సమయంలో వ్యాపారులు ధరలకు గండికొడుతున్నారు. ఈ క్రమంలో సూట్ విధానంలో ఇక ఉత్పత్తి చేయలేమని రైతులు స్పష్టంచేస్తున్నారు.
     
     ఖర్చులు పెరిగాయ్
     మామిడి సాగు ఖర్చులు అనూహ్యంగా పెరిగాయి. ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల ఖర్చవుతోంది. కాయకోతలకు రోజుకూలీ రూ.250 చెల్లిస్తున్నాం. గతేడాది ట్రాక్టర్ కిరాయి రూ.1500 ఉంటే ఈ ఏడాది రూ.2 వేలకు చేరింది. ఈక్రమంలో సూట్ విధానం అమలు చేస్తే గిట్టుబాటు ధర దక్కదు. మా కష్టాన్ని ఢిల్లీసేఠ్‌లు దోచుకుంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు.
     - మాగంటి నాగేశ్వరరావు, మామిడి రైతు, కోడూరు
     
     రోజులు మారాయి
     కాటా ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేయాలి. లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. రోజులు మారాయి. రైతు బాధల్ని వ్యాపారులు అర్థం చేసుకోవాలి. తెగుళ్లకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆరుగాలం మేము పడ్డ శ్రమను దోచుకుందామనుకుంటే కుదరదు. ఇక్కడ (నున్న) కాకపోతే వేరే మార్కెట్‌కు వెళ్తాం.
     - వీరంకి శ్రీనివాసరావు, మామిడి రైతు, కొత్తూరు తాడేపల్లి
     
     ఇదేమీ కొత్తకాదే
     ఢిల్లీ నుంచి వచ్చి నలభై ఏళ్లుగా మామిడి వ్యాపారం చేస్తున్నాం. సూట్ పేరుతో టన్నుకు 50 నుంచి 60 కేజీలు తీసేస్తాం. ఇది పాత విధానమే. మేం ఎక్కడ కొనుగోలు చేసినా ఇదే పద్ధతి. రైతులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. సూట్ తీస్తే వారికి నష్టమంటున్నారు. తీయకుంటే మాకు నష్టం వస్తోంది. దీనిపై చర్చలు సాగుతున్నాయి. ఏమవుతుందో చూద్దాం.
     - గౌలత్ రామ్, ఢిల్లీసేఠ్
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement