
ఏడాదంతా జయంతి వేడుకలు
అంబేడ్కర్ స్ఫూర్తిని ప్రజలందరిలో నింపేందుకుగాను రాష్ట్రంలో ఏడాదిపాటు ఆయన జయంతి ఉత్సవాల్ని నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.
♦ గాంధీజీ జాతిపిత అయితే.. అంబేడ్కర్ రాజ్యాంగానికి పిత
♦ దేశంలో ఎక్కడా లేనివిధంగా అమరావతిలో బాబాసాహెబ్ విగ్రహం
♦ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: అంబేడ్కర్ స్ఫూర్తిని ప్రజలందరిలో నింపేందుకుగాను రాష్ట్రంలో ఏడాదిపాటు ఆయన జయంతి ఉత్సవాల్ని నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఇందులో భాగంగా అంబేడ్కర్ రచనలను తెలుగులోకి అనువదించడం, ఆయన ఆలోచనపై వ్యాసరచన, పాటలు, క్రీడా పోటీలు, ప్రత్యేక పరుగుపందేలు, పోటీల్ని జరుపుతామన్నారు. అలాగే బౌద్ధమతానికి చెందిన వివిధ అంశాలపై చర్చలు చేపడతామన్నారు. అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని ఎ-కన్వెన్షన్ సెంటర్లో గురువారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
గాంధీజీ జాతిపిత అయితే.. అంబేడ్కర్ భారత రాజ్యాంగానికి పిత అని, ఆయన రాసిన రాజ్యాంగం ప్రతి భారతీయుడికి బైబిల్ లాంటిదని చెప్పారు. అనేక అవమానాలు, వివక్ష, అంటరానితనాన్ని అధిగమించి అనుకున్నది సాధించారన్నారు. అమరావతిలో 15 ఎకరాల్లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ హాస్టళ్లను మూడేళ్లలో, ఎస్టీ హాస్టళ్లను ఏడాదిలో రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తామని సీఎం చెప్పారు. దళిత యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఏటా దళితుల పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని, వారందర్నీ తన కుటుంబంలోని పిల్లలుగా చూసుకుంటానని చెప్పారు.
అభినవ అంబేడ్కర్ బాబు: రావెల
మంత్రి రావెల కిషోర్బాబు మాట్లాడుతూ చంద్రబాబును అభినవ అంబేడ్కర్గా అభివర్ణించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ మెమోరియల్ శిలాఫలకం, హాస్టళ్లను గురుకులాలుగా మార్చే శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు.37,525 మందికి సంబంధించి రూ.1,142 కోట్ల విలువైన ఉపకరణాలు, రుణాల పంపిణీని కూడా ఆయన ప్రారంభించారు.