బాలరాజు సమైక్యాంధ్ర ద్రోహి | balaraju in state Division of the bill | Sakshi
Sakshi News home page

బాలరాజు సమైక్యాంధ్ర ద్రోహి

Jan 23 2014 12:06 AM | Updated on Jul 7 2018 3:19 PM

సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడిన గిరిజన సంక్షేమ మంత్రి బాలరాజు వైఖరిని పలు సంఘాలు నిరసించాయి.

అరకులోయ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడిన గిరిజన సంక్షేమ మంత్రి బాలరాజు వైఖరిని పలు సంఘాలు నిరసించాయి. ఈ మేరకు అరకులోయలో బుధవారం వైఎస్సార్‌సీపీ అరకు నియోజకవర్గ సమన్వయకర్త కిడారి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ జంక్షన్‌వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కిడారి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు ఎంత నష్టం వాటిల్లుతుందో బాలరాజుకు తెలియదా? అని ప్రశ్నించారు.ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న  గిరిజన ప్రాంతాలు విభజన వల్ల మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోతాయన్నారు. బాలరాజు గిరిజన, సమైక్యాంధ్ర ద్రోహి అన్నారు.  ఈ కార్యక్రమంలో  శెట్టి అప్పాలు, సమర్డి రఘునాథ్, చట్టు అప్పలరాజు, గెమ్మెలి బాబురావు, మండ్యగురు శ్రీరాములు,స్వామిరాజు, బి.బి నాగేశ్వరరావు పాండు రంగస్వామి పాల్గొన్నారు.
 
ఏపీఎన్జీవోలు,టీడీపీ ఆధ్వర్యంలో
 
మంత్రి బాలరాజు సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడడాన్ని నిరసిస్తూ ఎన్జీవోలు,టీడీపీ నేతల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మంత్రి బాలరాజు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీవోల సంఘం నాయకులు ఆర్ మత్స్యలింగం,సత్యనారాయణ,కన్నబాబు, మండల అధ్యక్షుడు శెట్టి బాబురావు, అబ్రహం, పట్నాల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
 
గుణపాఠం తప్పదు
 
డుంబ్రిగుడ : గిరిజన సంక్షేమ మంత్రి బాలరాజు బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ డుంబ్రిగుడలో నిరసన తెలిపింది.ఈమేరకు కొవ్వొత్తుల ర్యాలీనిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు కె సుబ్బారావు మాట్లాడుతూ  రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తుంటే ఒక సీమాంధ్ర మంత్రి విభజనకు అనుకులంగా మాట్లాడం అన్యాయమన్నారు.

ఇటువంటి ద్రోహులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మంత్రి కేవలం తన పదవిని కాపాడుకునేందుకే రాష్ట్ర విభజనకు అనుకులంగా మాట్లాడుతున్నారన్నారు. ఇదే తరుణంలో బాలరాజు వైఖరికి నిరసనగా నేడు డుంబ్రిగుడలో బంద్ నిర్వహిస్తునట్లు  సుబ్బారావు తెలిపారు. ప్రజలు,వ్యాపారులు బంద్‌కు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బి మూర్తి,సింహద్రి,భాస్కర్రావు, కొండబాబు,అర్జున్,నందారావు,చిరంజీవి పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement