కలెక్టరేట్ ఎదుట కారు ఢీకొని ఓ అంగన్వాడీ ఆయమ్మ తీవ్రంగా గాయపడింది. దీంతో కోపోద్రిక్తులైన కార్యకర్తలు, ఆయాలు కారును ధ్వంసం చేశారు.
నిజామాబాద్క్రైం, న్యూస్లైన్: కలెక్టరేట్ ఎదుట కారు ఢీకొని ఓ అంగన్వాడీ ఆయమ్మ తీవ్రంగా గాయపడింది. దీంతో కోపోద్రిక్తులైన కార్యకర్తలు, ఆయాలు కారును ధ్వంసం చేశారు. రహదారిపై రాస్తారోకోకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. వివరాలు ఇలా ఉన్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయమ్మలు నాలుగు రోజులుగా కలెక్టరేట్ ఎదుట దీక్ష చేస్తున్నారు.
ఈ క్రమంలో గురువారం కూడా వారు దీక్ష శిబిరం వద్ద ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన ఆయమ్మ యెల్లోల గొండమ్మ కూడా కలెక్టరెట్ వద్దకు చేరుకుంది. దీక్ష శిబిరం ముందున్న రోడ్డు దాటుతుండగా ఎన్టీఆర్ చౌరాస్తా వైపు నుంచి వేగంగా వచ్చిన మారుతి కారు (ఏపీ 29 ఏఈ 0081) గొండమ్మను ఢీకొట్టింది. దీంతో ఆమె పెకైగిరి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి.
ఈ సంఘటనతో దీక్షలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెం టనే గొండమ్మను ఆస్పత్రికి తరలించారు. ఆగ్రహం పట్టలేక కారు అద్దాలను పగులగొట్టారు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై అంగన్వాడీ కార్యకర్తలను నివారించారు. దీంతో కార్యకర్తలు రోడ్డుపై బైఠాయిం చి రాస్తారోకో చేశారు. తమ సమస్యలపై నాలుగు రోజులుగా దీక్ష చేస్తుంటే కలెక్టర్ ఏ మాత్రం పట్టించుకోవటంలేదని విమర్శించారు.
కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతర ం ఎన్టీఆర్ చౌరస్తా వద్దకు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో నిజామాబాద్ డీఎస్పీ అనిల్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించారు. కొద్దిసేపటి తర్వాత కార్యకర్తలే స్వచ్ఛందంగా రాస్తారోకోను విరమించి దీక్ష శిబిరం వద్దకు వెళ్లిపోవడంతో ట్రాఫిక్ క్లి యరైంది. కారు నడుపుతున్న ముత్యంరెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నాల్గో టౌన్ ఎస్ఐ నరేష్ తెలిపారు.