'ఇంగ్లీష్‌ విద్యపై మతపరమైన విమర్శలు చేయడం దారుణం'

Avanthi Srinivas Conducted Meeting With Boat Operators In Secretariat - Sakshi

సాక్షి, అమరావతి : ఇంగ్లీష్‌ మీడియం విద్యపై మతపరమైన విమర్శలు చేయడం దారుణమని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టనున్న ఇంగ్లీష్‌ మాధ్యమానికి, క్రిస్టియన్‌ మతానికి ఏం సంబంధం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బడుగు, బలహీన, నిమ్న వర్గాల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఇంగ్లీష్‌ మీడియం విద్య అందించడం తప్పా అని ప్రశ్నించారు. వంగవీటి రంగా హత్యతో కుల రాజకీయాలు చేసిన టీడీపీ ఇప్పుడు మతానికి సంబంధించి రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో పర్యాటక శాఖ అధికారులతో సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 300 బోట్లున్నాయని, ఇప్పటికే కాకినాడ, మచిలీపట్నం డివిజన్లలో తనిఖీలు నిర్వహించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 21న 9 కంట్రోల్‌ రూమ్‌లకు సీఎం శంఖుస్థాపన చేస్తారని, వచ్చే మూడు నెలల్లో కంట్రోల్‌ రూమ్‌లు నిర్మిస్తామని వెల్లడించారు. ప్రతి కంట్రోల్‌ రూంకు ఐదుగురు అధికారులు ఉంటారని తెలిపారు. బోటు నడిపేవారు ఎవరయినా అన్ని నిబంధనలను పాటిస్తామని లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి హామీ ఇస్తేనే బోట్లు తిప్పడానికి అవకాశం ఇస్తామని వెల్లడించారు. ఇందుకోసం సారంగులకు పరీక్షలు పెట్టి, బోటుకు ఫిట్‌నెస్‌ నిర్వహించాకే అనుమతిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్‌ 15 నాటికి అన్ని సిద్ధం చేసి బోటు ఆపరేషన్‌ ప్రారంభిస్తామని, ప్రతి బోటు ఆపరేటర్‌ కొత్తగా లైసెన్సుకి దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సీనియర్‌ సారంగులైనా పరీక్ష రాయాల్సిందేనని, అయితే పరీక్షకు సంబంధించి ముందుగా18 రోజులు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత పరీక్ష పెడతామని వివరించారు.      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top