ఆక్వా చెరువుల్లో మృత్యుఘంటికలు | Aqua ponds | Sakshi
Sakshi News home page

ఆక్వా చెరువుల్లో మృత్యుఘంటికలు

Dec 27 2014 1:44 AM | Updated on Sep 2 2017 6:47 PM

ప్రస్తుతం సముద్ర తీరప్రాంత గ్రామాల్లో సాగులో ఉన్న వెనామీ రొయ్య చలికి వణుకుతోంది. శీతల పరిస్థితులను వెనామీ రకం రొయ్యలు తట్టుకోవడం కష్టం.

పిట్టలవానిపాలెం : ప్రస్తుతం సముద్ర తీరప్రాంత గ్రామాల్లో సాగులో ఉన్న వెనామీ రొయ్య చలికి వణుకుతోంది. శీతల పరిస్థితులను వెనామీ రకం రొయ్యలు తట్టుకోవడం కష్టం. వారం రోజులుగా వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. చలి ఎక్కువగా ఉండడంతోపాటు, మంచు అధికంగా కురుస్తోంది. ఈ ప్రాంతంలో సుమారు 3 వేల ఎకరాల్లో  వెనామీ రకం రొయ్య సాగవు తోంది. గత కొంత కాలంగా వెనామీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది.
 
 చెరువులపై మంచు తెరలు ఉదయం 10 గంటలకు కూడా తొలగడం లేదు. ప్రస్తుతం సాగులో ఉన్న నెలలోపు వెనామీ రొయ్యలు చలికి తట్టుకోలేకపోతున్నాయి. కొన్ని పిల్లలు చెరువులోనే మృత్యువాత పడుతున్నాయి. మరికొన్ని మేత కూడా తీసుకోలేక పోవడం వల్ల పెరుగుదల లోపం కనిపిస్తోంది. కొద్ది రోజులపాటు ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగితే 50 నుంచి 70 శాతం మేర రొయ్య పిల్లలు మృత్యువాత పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
 వెనామీకి ఈ వాతావరణం ఇబ్బందికరమే...
 కొద్ది రోజులుగా శీతల వాతావరణ పరిస్థితులు వెనామీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడంతో చలి తీవ్రత అధికమైంది. దీంతో రొయ్య పిల్ల సరిగా మేత తినలేక ఎదుగుదల నిలిచిపోతోంది. రోజుల పిల్లలైతే చలికి తట్టుకోలేక చెరువు లోనే మృత్యువాత పడుతున్నాయి.
 - బడుగు ప్రకాశరావు,రైతు
 
 వేసవి పంటకు ఈ పంటకు తేడా ఉంది..
 వేసవి కాలంలో సాగు చేసే రొయ్యసాగుకు ప్రస్తుతం చలికాలంలో సాగుకు చాలా తేడా ఉంది.  ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండడంతో రొయ్యలు మేత సరిగా తినక పోవడం వల్ల ఎదుగుదల ఉండడం లేదు. మరోవైపు ఖర్చులు పెరిగిపోతున్నాయి.
 - మంతెన గంగరాజు,రైతు
 

Advertisement
 
Advertisement
Advertisement