బోటు ప్రమాదం: మరో 14 మృతదేహాలు లభ్యం

Another Eight Dead Body Found At Godavari - Sakshi

కొనసాగుతున్న గాలింపు చర్యలు

ఇప్పటి వరకు 22 మృతదేహాలు గుర్తింపు

సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాదం ఘటనలో గల్లంతయిన మృతదేహాలు ఒక్కొక్కటిగా లభిస్తున్నాయి. మంగళవారం ఉదయం 14 మృతదేహాలను గాలింపు సిబ్బంది కనుగొన్నారు. ప్రమాద స్థలం కచ్చులురు వద్ద నాలుగు, దేవీపట్నంలో 8, ధవలేశ్వరం వద్ద నాలుగు పోలవరం, పట్టిసీమ, తాళ్లపూడిలో ఒక్కో మృతదేహాలు లభించాయి. మిగిలిన వాటి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు, నేవీ, విపత్తు నివారణ బృందాల గోదావరిని జల్లెడ పడుతున్నాయి. గాలింపు కోసం చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌ నుంచి ప్రత్యేక సిబ్బందిని రప్పించారు. ఇప్పటి వరకు లభించిన మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన మృతదేహాలన్నీ బోట్‌కు దిగువన లేదా బోట్‌ మొదటి అంతస్తులోని ఏసీ క్యాబిన్‌లో చిక్కుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 22 మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు.

కచ్చులూరు మందం వద్ద ప్రమాదానికి గురైన బోటు గోదావరి ఉపరితలం నుంచి 315 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. మరోవైపు ప్రమాద స్థలానికి ఇరువైపులా ఎత్తైన కొండలున్నాయి. ఈ రెండు కారణాల వల్ల బోటును వెలికి తీయటం చాలా కష్టంతో కూడుకున్న పని అని నేవీ, పోర్టు వర్గాలు చెబుతున్నాయి. కొండ ప్రాంతం కావడంతో బోటును వెలికి తీయడానికి ఉపయోగించే క్రేన్‌లను అక్కడకు తరలించటం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో బోట్ల సహాయంతోనే రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించాల్సి ఉంటుంది. కాగా లాంచీలోని మొత్తం 73 మందిలో 27 మంది సురక్షితంగా బయటకురాగా 46 మంది గల్లంతయిన విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top