
సాక్షి, అమరావతి/తుళ్లూరు రూరల్: ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో అమరావతిని ఒకటిగా నిలుపుతామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్లూ అండ్ గ్రీన్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ఇంజనీర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. శుక్రవారం విజయవాడలో రూ. 101 కోట్లతో నిర్మించిన ఆర్అండ్బీ ఐదంతస్తుల భవన సముదాయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధిలో రహదారులు, భవనాల శాఖదే కీలక పాత్ర అన్నారు. జిల్లా కలెక్టరేట్లను ఆధునీకరించి జిల్లాల్లో అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే చోట ఉండేలా భవన సముదాయాలు చేపట్టే ఆలోచన ఉందన్నారు. నూతనంగా నిర్మించే సచివాలయంలో మంత్రులు, సంబంధిత కార్యదర్శులు, విభాగాధిపతులు అంతా ఒకే చోట ఉండేలా రెండు మూడు టవర్లు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. పీపుల్స్ హబ్ ఏర్పాటు చేసి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, ఉమా మహేశ్వరరావు, రవీంద్ర, ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేతా తదితరులు పాల్గొన్నారు.
భూములకు యునిక్ ఐడీ: ప్రతి ఒక్కరికీ ఆధార్ నంబర్ కేటాయించినట్టుగా, రాష్ట్రంలోని భూములకు త్వరలో యునిక్ ఐడీ నంబరు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భూసేవ కార్యక్రమంలో భాగంగా ఈ నంబర్లు కేటాయిస్తారని చెప్పారు. శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వివిధ శాఖల్లో ఐటీ, ఐవోటీ, ఇ–ప్రగతి అమలు తీరును సీఎం సమీక్షించారు. ప్రస్తుతం అందుబాటులో వున్న డిజిటలైజ్డ్ ఫీల్డ్ మ్యాప్ బుక్ (ఎఫ్ఎంబీ) వంటి సమాచారంతో భూసేవకు రూపకల్పన జరుగుతుందన్నారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 20 సేవల్ని అనుసంధానించి భూసేవ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఇప్పటికే ఎనిమిది సేవల అనుసంధానం పూర్తయిందని చెప్పారు. జగ్గయ్యపేట మండలంతో పాటు ఉయ్యూరు మునిసిపాలిటీలో భూసేవ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని, వచ్చే నెలాఖరు కల్లా అది పూర్తవుతుందని తెలిపారు.
డిజిటల్ తరగతుల ప్రారంభం: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతులను శుక్రవారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విద్యార్థులతో కలసి వర్చువల్ తరగతులను నిర్వహించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. డిజిటల్ తరగతుల వల్ల విద్యార్థులకు పాఠాలు వేగంగా అర్థమవుతాయని తెలిపారు. ప్రతి ఇంటికీ ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ ఇస్తామని, తద్వారా విద్యార్థులు పాఠశాలకు రాలేనపుడు ఇంటి వద్ద ఉండే పాఠ్యంశాలను చూడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆర్టీజీ సీఈఓ బాబు, విద్యాశాఖ కమిషనర్ సం«ధ్యారాణి, గుంటూరు కలెక్టర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన నటుడు సురేష్గోపి
మలయాళ సినీ నటుడు సురేష్గోపి శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. కేరళలో జరిగే ‘జాతీయ బనానా ఫెస్టివల్’కు సీఎంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సురేష్గోపి మీడియాతో మాట్లాడుతూ.. 2018 ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు త్రివేండ్రంలో బనానా ఫెస్టివల్ జరుగుతుందని, దీనికి చంద్రబాబును ఆహ్వానించినట్లు చెప్పారు.