ఎయిర్‌పోర్టు ఎదుట ఫ్లైఓవర్ | Airport in front of flyover | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టు ఎదుట ఫ్లైఓవర్

Sep 10 2015 3:43 AM | Updated on May 29 2018 11:47 AM

ఎయిర్‌పోర్టు ఎదుట ఫ్లైఓవర్ - Sakshi

ఎయిర్‌పోర్టు ఎదుట ఫ్లైఓవర్

గన్నవరం ఎయిర్‌పోర్టు ఎంట్రన్స్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు...

- ఆరు వరుసలుగా హైవే విస్తరణ
- ఏడు కిలోమీటర్ల మేర ఏలూరు కాలువ మళ్లింపు
- సీఆర్‌డీఏ సమీక్షలో సీఎం చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో :
గన్నవరం ఎయిర్‌పోర్టు ఎంట్రన్స్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో సీఆర్‌డీఏ అధికారులతో ఆయన రాజధాని వ్యవహారాలపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు అప్రోచ్‌రోడ్డును హైవే వరకు నాలుగు లైన్లుగా విస్తరించి అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. హైవే, విమానాశ్రయం ట్రాఫిక్‌కు సంబంధం లేకుండా ఉండేలా దీన్ని నిర్మించాలని సూచించారు. భారీ విమానాలు ఆగేందుకు వీలుగా రన్‌వే విస్తరణ కోసం ఏలూరు కాలువను ఏడు కిలోమీటర్లు మళ్లించే పనులను 40 రోజుల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రెండు ఆర్ అండ్ బీ రోడ్లను మూడు కిలోమీటర్ల మేర మళ్లించే పనులను 45 రోజుల్లో చేయాలని సూచించారు.

విశాఖపట్నం - విజయవాడ, చెన్నయ్ - నెల్లూరు, విజయవాడ - బందరు జాతీయ రహదారులను ఆరు వరుసలుగా విస్తరించాలని, ఇందుకోసం వెంటనే సవివర నివేదికలు తయారు చేయాలని సీఎం హైవే అధికారులను కోరారు.
 
పండుగలా రాజధాని శంకుస్థాపన ..
అక్టోబర్ 22వ తేదీన రాజధాని శంకుస్థాపనను పండుగలా చేయాలని, ప్రధాని మోదీ, సింగపూర్ ప్రధాని, జపాన్ వాణిజ్య మంత్రి ఈ కార్యక్రమానికి వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుతెలిపారు. శంకుస్థాపన పైలాన్ భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా ఉండాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని ఒక పార్కుగా తయారు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 29 రాజధాని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలని, దాన్లో గ్రామస్తులకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. గ్రామకంఠాలకు ఆనుకుని ఉన్న 8 వేల ఎకరాలను భూసమీకరణ కింద ఇస్తామని పెదపరిమి, హరిశ్చంద్రాపురం, వడ్డమాను గ్రామాల రైతులు ముందుకు వచ్చారని, దీన్ని పరిశీలించాలని సీఆర్‌డీఏ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు కార్యాలయాల తరలింపును వేగవంతం చేయాలని సూచించి అధికారులకు అవసరమైన నివాస సౌకర్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement