‘మీ సేవ’లో ఆధార్ సమాచారం | aadhar information in mee seva centers | Sakshi
Sakshi News home page

‘మీ సేవ’లో ఆధార్ సమాచారం

Dec 2 2013 1:25 AM | Updated on Sep 2 2017 1:10 AM

జిల్లాలో ఆధార్ నమోదు చేయించుకున్న వారిలో 26 లక్షల మందికి యూఐడీ నెంబర్లు జనరేట్ అయ్యాయని జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు తెలిపారు.

కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలో ఆధార్ నమోదు చేయించుకున్న వారిలో 26 లక్షల మందికి యూఐడీ నెంబర్లు జనరేట్ అయ్యాయని జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వీటిని గ్రామం, మండలం వారీగా ఆల్ఫాబెటికల్ పద్ధతిలో ఉంచామని, వివరాలను మీసేవ కేంద్రాల నుంచి పొందవచ్చన్నారు. వీటితోపాటు ఆధార్ సమాచారం మొత్తం మీ సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉందన్నారు.  రూ. 25 చెల్లించి యూఐడీ నెంబర్‌తోపాటు కార్డు కూడా పొందవచ్చన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 300 ఆధార్ సెంటర్లు నడుస్తున్నాయని, ఇప్పటిదాకా నమోదు చేయించుకోని వారు వెంటనే ఏదో ఒక కేంద్రాన్ని సందర్శించి నమోదు చేయించుకోవాలన్నారు.
 స్కాలర్‌షిప్ దరఖాస్తుల పొడిగింపుపై ప్రచారం చేయండి
 స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును నవంబర్ 30వతేదీ నుంచి డిసెంబర్ 10 వరకు పొడిగించామని, ఈ విషయంపై ప్రచారం చేసి విద్యార్థులంతా సద్వినియోగం చేసుకునేలా చూడాలని జాయింట్ కలెక్టర్ కన్నబాబు సూచించారు. శనివారం తన ఛాంబర్‌లో డీబీటీపై నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ అనేకమంది యూఐడీ నెంబర్లు రాలేదనే అసంతృప్తితో ఉన్నారని, అటువంటి వారందరూ మీ సేవ సెంటర్లకు వెళ్లి కార్డులు పొందాలన్నారు. బ్యాంకు ఖాతాలను ఆధార్ నెంబర్లతో అనుసంధానం చేసి ఎల్‌డీఎంకు అప్పగించాలన్నారు. ఉపకార వేతనాలకు 84 వేల మంది అర్హులుగా ఉంటే ఇప్పటి వరకు 45 వేల మంది మాత్రమే ఆధార్ నమోదు చేయించుకున్నారని, మిగతా వారు వెంటనే నమోదు చేయించుకునేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణి, బీసీ, గిరిజన సంక్షేమాధికారులు రవిచంద్ర, గిరిధర్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement