ఆధార్ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు | Aadhaar set up special centers | Sakshi
Sakshi News home page

ఆధార్ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు

Jul 19 2014 3:48 AM | Updated on Sep 2 2017 10:29 AM

సామాజిక పెన్షనుదారులు, ఉపాధిహామీపథకం జాబ్‌కార్డుదారులు నెలాఖరులోగా ఆధార్ వివరాలు నమోదు చేయించుకోవాలని కలెక్టర్ రఘునందన్‌రావు సూచించారు.

  • నెలాఖరు వరకు గడువు
  •  కలెక్టర్ రఘునందన్‌రావు
  • తిరువూరు : సామాజిక పెన్షనుదారులు, ఉపాధిహామీపథకం జాబ్‌కార్డుదారులు  నెలాఖరులోగా ఆధార్ వివరాలు నమోదు చేయించుకోవాలని  కలెక్టర్ రఘునందన్‌రావు సూచించారు.  శుక్రవారం తిరువూరు వచ్చిన ఆయన తహ సీల్దారు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  పలు పథకాల్లో ఆధార్‌నంబరును తప్పనిసరిగా ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినందున జిల్లాలో ఆధార్‌కార్డుల జారీకి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  

    మీసేవా కేంద్రాల్లో కూడా శాశ్వత ఆధార్ కేంద్రాలను నిర్వహిస్తున్నందున పెన్షన్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, పట్టాదారు పాసుపుస్తకాలు, రేషన్‌కార్డుదారులు విధిగా తమ డేటా ఎంట్రీ చేయించుకుని కార్డులు పొందాలని కోరారు.  ఈ నెలాఖరులోపు వివరాలు నమోదు చేయని పెన్షనర్లు, ఉపాధిహామీపథకం కూలీలకు చెల్లింపులు నిలిచిపోతాయని స్పష్టం చేశారు.  జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాలు 36శాతం, రేషన్‌కార్డులు 56శాతం, ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డులు 76శాతం, పెన్షన్లు 50శాతం మాత్రమే ఆధార్‌కు అనుసంధానం చేశారని, మిగిలినవి  త్వరలో అనుసంధానిస్తామని తెలిపారు.
     
    ఇసుక తవ్వకాల నిరోధానికి టాస్క్‌ఫోర్స్...
     
    జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధించడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.  ఇసుక తవ్వకాలపై తమకు సమాచారం ఇస్తే టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.  అనుమతి లేకుండా ఇసుక, గ్రావెల్ తవ్వకాలు జరపడం నేరమని తెలిపారు.  
     
    అధికారులతో సమావేశం...
     
    పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగల్స్ ఆన్‌లైన్ పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.  ఎన్ని పట్టాదారు పాసుపుస్తకాలను ఆన్‌లైన్ చేశారు, ఆధార్ నంబర్ల నమోదు తదితర వివరాలను  వీఆర్‌వోలనడిగి తెలుసుకున్నారు. మల్లేల, రామన్నపాలెం రెవెన్యూ గ్రామాల పరిధిలో అన్యాక్రాంతమైన అసైన్డ్‌భూములు, అటవీ, రెవెన్యూ భూములపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తహసీల్దారును ఆదేశించారు.  నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రథర్‌బాబు,  ఎంపీడీవో సుమమాలిని, సీడీపీవో అంకమాంబ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ షకీల్‌అహ్మద్  పాల్గొన్నారు.
     
    కౌలు రైతుల గుర్తింపునకు గ్రామసభలు
     
    విస్సన్నపేట :  కౌలురైతులను గురిచేందుకు గ్రామసభలు నిర్వహిస్తామని కలెక్టర్ రఘునందన్‌రావు అన్నారు. తహసీత్దారు కార్యాలయాన్ని ఆయన శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ   ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ రుణాలు మంజూరైన వారి దరఖాస్తులను  పరిశీలించి మరళా రెన్యూవల్ చేయ్యాలా లేదా అనేది  నిర్ణయిస్తామన్నారు.డీఎస్సీ ద్వారా త్వరలోనే అవసరమైన చోట ఉపాధ్యాయులను నియమిస్తామని తెలిపారు. తహసీల్దార్ సాయిగోపాల్,ఎంపీడీవో జాన్సీరాణి,ఎంఈవో రేణుకానందరావు   పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement